
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటాకు మించి కృష్ణా జలాలను వాడుకుంటున్నా సీఎం రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లేనందువల్ల, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నందువల్ల నీటిని తరలించుకునేందుకు చంద్రబాబుకు సులువు అయిందని హరీశ్ రావు అంటున్నారు. ఇష్టం వచ్చినట్లు జలదోపిడీ జరుగుతున్నా ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి పరోక్షంగా సహకరిస్తున్నారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మధ్య పరోక్ష సంబంధం... గురు దక్షిణ చెల్లించుకుంటున్నారేమోనని హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ ప్రతినిత్యం సమీక్ష చేసేవారని... ఇప్పుడు సీఎం, మంత్రి కనీసం పట్టించుకోవడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్ర సాగు, తాగు నీటి ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మాజీమంత్రి హరీశ్ రావు ఆక్షేపించారు.
సోయి లేని ప్రభుత్వం అధికారం లోకి వస్తే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో అర్థం అవుతోందని హరీశ్ రావు విమర్శించారు. నీళ్ల మంత్రి నీళ్లు నములుతున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ తెలంగాణ భూములకు నీరు పారిస్తే... కాంగ్రెస్ నీళ్లు నములుతోందని హరీశ్ రావు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం తెలంగాణకు పెనుశాపంగా మారిందని... కేంద్రాన్ని అడిగే ధైర్యం లేదు, చంద్రబాబును అడిగే దమ్ము లేదని హరీశ్ రావు ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను బాగా విమర్శిస్తారు... కానీ, కేంద్రాన్ని అడిగే పరిస్థితి లేదని హరీశ్ రావు మండిపడ్డారు. నీటి తరలింపు ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని... రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది కాబట్టే ఏపీ ఇష్టం వచ్చినట్లు నీటిని తరలించుకుపోతోందని ఆరోపించారు. తెలంగాణ ఇప్పటికే నష్టపోయింది, ఇప్పటికైనా కళ్లు తెరవాలని హరీశ్ రావు అన్నారు. ఆరున్నర లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేసుకున్నారు, సాగర్ ఎడమకాల్వకు ఇంకా నాలుగు తడులు కావాలి... హైదరాబాద్ సహా చాలా జిల్లాల తాగునీటి అవసరాలు ఉన్నాయని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి ఏపీకి నీరు ఆపేలా చూడాలన్న హరీశ్ రావు కృష్ణా బోర్డు కార్యాలయం ముందు, దిల్లీలో ధర్నా చేద్దాం, తామూ వస్తామని హరీశ్ రావు తెలిపారు.