బెంగళూరు పేరు చెబితే ప్రధానంగా గుర్తుకు వచ్చేది ఆహ్లాదకర వాతావరణం. ప్రముఖ కంపెనీలు, ఐటీ కంపెనీలు, ఉద్యోగులు ఇలా.  దక్షిణాది రాష్ట్రాల్లో బెంగళూరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.  వీటితో పాటు అక్కడ ట్రాఫిక్ కూడా ప్రధాన సమస్య అన్న సంగతి తెలిసిందే.  ఎందుకంటే అక్కడ ఉండే జనాభా పాపులేషన్ కు అక్కడి రోడ్ల రద్దీకి  ఇప్పటికీ అది తీరని సమస్యలానే ఉంది. ఈ క్రమలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవి ఆసక్తిగా మారాయి.


బెంగళూరు నగర రహదారుల సమస్యపై చర్యలు చేపట్టడానికి ఉప్క్రమించినట్లు చెబుతున్న వేళ.. కర్ణాటక డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన రహదారులతో పాటు ఫుట్ పాత్ లు, వాటి పొడవునా మొక్కల పెంపకానికి ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు. రోడ్లకు మంచి రూపునివ్వడానికి అవసరమైన పథకాలను సిద్ధం చేయాలని అన్నారు.


బెంగళూరు పాలికే ఆఫీసులో "నమ్మ రస్తా" అనే అంశంపై సెమినార్, వస్తు - ఫోటో ప్రదర్శనను ప్రారంభించారు.  ఈ సందర్భంగా స్పందించిన ఆయన... రెండు మూడేళ్లలో బెంగళూరును మార్చేస్తామంటే సాధ్యం కాదని.. దేవుడే దిగివచ్చినా అంత భారీ మార్పు అసాధ్యమని.. పక్కా ప్రణాళికతో క్రమబద్ధంగా మార్పులు సాధించాలని చెప్పుకొచ్చారు. బెంగళూరులో నానాటికీ తీవ్రం అవుతున్న ట్రాఫిక్, మౌలిక వసతుల సమస్యల పరిష్కరించడం తుదకు భగవంతుడికి సాధ్య కాదని సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.


సురక్షితంగా విద్యుత్ స్తంభాల ఏర్పాటు, బస్ షెల్టర్లు, జంక్షన్ లను సుందరంగా తీర్చిదిద్దాలని.. ప్రతీ రోడ్డు, ఫుట్ పాత్ మార్గాలు ఏకరూపంలో ఉండాలన్నది సర్కార్ ఆలోచన అని వివరించారు. ఇదే సమయంలో.. బయట కనబడే కేబుల్ తీగలను కత్తిరించేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. భయం గొలుపుతూ కనిపించే వైర్లు ఇకపై కనిపించకూడదని తెలిపారు.


ఇదే సమయంలో ప్రధానంగా రోడ్లకు ప్రత్యామ్న్యాయంగా అండర్ గ్రౌండ్ మార్గాల నిర్మాణం అనేది బెంగళూరు నగరంలో పెద్ద సవాళ్లతో కూడుకున్నదని.. సిటీలో సుమారు 17 వందల కిలోమీటర్ల రోడ్లు "వైట్ టాపింగ్" చేస్తున్నట్లు తెలిపారు.  ఇక ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుతున్నాయి. ఎడతెగని ట్రాఫిక్ సమస్యలపై రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ను అనేక మంది తూర్పారపడుతున్నారు. మరి దీనిపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: