
టిడిపి అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై.. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారాయి. బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా జగన్లాగా ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉండరేమో. రాజకీయంగా చంద్రబాబుపై చాలామంది విమర్శలు చేశారు. భవిష్యత్తులో చేస్తారు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందే లేదు. అయితే జగన్ చేసిన గ్లామర్ వ్యాఖ్యలు మాత్రం కామెడీగా మారాయి. జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పరామర్శించి వచ్చిన వెంటనే.. జగన్ చేసిన వ్యాఖ్యలు చూసి వైసిపి వాళ్ళు సైతం కూడా.. అసలు మా జగన్కు ఏమైంది అని గుసగుసలాడుకుంటున్నారు.
చంద్రబాబు, లోకేష్ కంటే వంశీ గ్లామర్గా ఉన్నాడు.. బాగా ఎదుగుతున్నాడు.. అంటే తట్టుకోలేడు. తన సామాజిక వర్గం నుంచి అందుకే.. కొడాలి నానిని చూసిన చంద్రబాబు జీర్ణించుకోలేరు. చంద్రబాబు కంటే చక్కగా ఉంటాడు.. కాబట్టి దేవినేని అవినాష్ కూడా ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు. ఎందుకంటే లోకేష్ కంటే చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు మనస్తత్వం. ఆయన కొడుకు మాత్రమే.. తన సామాజిక వర్గంలో లీడర్లుగా ఉండాలని చూస్తారు. ఇతరులు ఎవరిని ఎదగనివ్వరు అంటూ జగన్ కామెంట్ చేశారు.
ఈ వ్యాఖ్యలతో సీరియస్గా సాగాల్సిన ఈ పొలిటికల్ ఎపిసోడ్ను.. జగన్ మొత్తం కామెడీగా చేశారనే సెటైర్లు వైసీపీ నేతలు నుంచే వినిపిస్తున్నాయి. అయినా మగవాళ్ళు అందం గురించి.. అందులో రాజకీయ నాయకులు అందం గురించి.. మాజీ సీఎం గా ఉన్న జగన్ మాట్లాడటం ఏంటో అర్థం కావడం లేదు. ఏ పార్టీ అయినా రాజకీయ నాయకులు అందం చూసి టార్గెట్ చేస్తుందా.. అనే చర్చ కూడా తెరమీదకు వచ్చింది. జగన్ సీరియస్గా సాగాల్సిన పాయింట్ను కామెడీగా మార్చేసారని.. వైసిపి వాళ్ళే అనుకుంటున్నారు.