ఏపీ, తెలంగాణ కృష్ణా జలాల పంచాయతీ తేల్చాల్సిన కృష్ణా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల కింద రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పంటలను దృష్టిలో ఉంచుకొని నీటి అవసరాలపై ఓ నిర్ణయానికి రావాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సూచించింది. రెండు రాష్ట్రాల సంబంధిత చీఫ్ ఇంజనీర్లు రేపు సమావేశమై ఓ అభిప్రాయానికి రావాలంటూ.. బంతి రెండు రాష్ట్రాల కోర్టులోకే వేసింది.

ఇరు రాష్ట్రాల ఈఎన్సీల సమావేశం తర్వాత బుధవారం కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం అవుతుంది. నీటి విడుదల విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కృష్ణా బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో హైదరాబాద్ జలసౌధలో జరిగిన ప్రత్యేక సమావేశంలో తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్, ఏపీ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వాటాకు మించి నీటిని వాడుకున్నందున నిలువరించాలని తెలంగాణ నీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా బోర్డు ఛైర్మన్ ను కోరారు. శ్రీశైలం నుంచి ఉన్న పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, తదితరాల ఔట్ లెట్ల నుంచి ఏపీ నీటి వినియోగాన్ని పూర్తి ఆపాలని అన్నారు. తాగునీటి అవసరాల కోసం తమకు శ్రీశైలం, నాగార్జునసాగర్ లో పది టీఎంసీల చొప్పున అందుబాటులో ఉంచాలని కోరారు.

సముద్రంలోకి వృధాగా పోయే వరదనీటిని తాము వినియోగించుకున్నామని.. పరిగణలోకి తీసుకోరాదని ఏపీ ఈఎన్సీ అన్నారు. సాగర్, శ్రీశైలం కింద పంటలు ఉన్నాయని.. వాటికి సరిపడా నీరు అవసరమని పేర్కొన్నారు. వరద జలాల వినియోగానికి సంబంధించి కూడా సమావేశంలో లెక్కలు తీసినట్లు తెలిసింది. నల్గొండ సీఈ అజయ్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో ఉన్నందున అందుబాటులోకి రాలేదు. ఏపీ సీఈని రేపు నల్గొండ వెళ్లి అక్కడే మాట్లాడాలని కృష్ణా బోర్డు సూచించారు. ఆ తర్వాత రేపు జరగనున్న త్రిసభ్య కమిటీ సమావేశంలో నీటి విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: