
దరాబాద్ సింగరేణి భవన్ లో ఆస్ట్రేలియా దేశంలోని క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి రోస్ బేట్స్, ఆ రాష్ట్ర అధికారుల బృందంతో నిర్వహించిన కీలక ఖనిజాల ఉత్పత్తి, వ్యాపార విస్తరణ అవకాశాల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో విద్యుత్ వాహనాలు సోలార్ విద్యుత్, బ్యాటరీ స్టోరేజ్ సిస్టెమ్ లకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ రంగానికి అవసరమైన వనడియం, కోబాల్ట్, ఇండియం, క్రోమియం, టైటానియం వంటి 11 రకాల కీలక ఖనిజాలు ఎంతో అవసరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.
ఇప్పటివరకు ఈ కీలక ఖనిజాలను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. అయితే ఈ ఖనిజాల లభ్యత క్వీన్స్ లాండ్ లో అధికంగా ఉన్నందున వీటి ఉత్పత్తి, విక్రయానికి పరస్పర లబ్ధి చేకూరే వ్యాపార ఒప్పందంపై ప్రాథమికంగా అవగాహనకు వచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రం 2029-30 నాటికి 20,000 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యాన్ని సాధించడం ద్వారా దేశానికే అదర్శప్రాయంగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు వెళుతుందన్నారు. ఈ విషయంలో క్వీన్ లాండ్స్ సహకారం తీసుకుంటామన్నారు.
తెలంగాణ రాష్ట్రం - క్వీన్స్ ల్యాండ్ మధ్య సంయుక్త మైనింగ్, మినరల్ వ్యాపారానికి సింగరేణి సంస్థను ఒక నోడల్ ఏజెన్సీగా నియమిస్తున్నామన్నారు. సింగరేణి సంస్థ ఇప్పటికే క్వీన్స్ లాండ్స్ తో రక్షణకు సంబంధించి సిమ్టార్స్ తో, మైనింగ్, టెక్నాలజీకి సంబంధించి సి.ఎస్.ఐ.ఆర్.ఓ. తదితర సంస్థలతో ఒప్పందాలు చేసుకొని సేవలు పొందుతుందన్నారు. తాజాగా క్వీన్స్ ల్యాండ్ మంత్రి సమక్షంలో కీలక ఖనిజాల వెలికితీత, భారీ ఖనిజ ఉత్పత్తి యంత్రాలు సాంకేతికత, రక్షణ పెంపుదలకు, వెంటిలేషన్ మెరుగుదల, ఎక్కువ లోతులో ఉన్న బొగ్గు నిల్వల తవ్వకానికి సంబంధించి ఆధునిక సాంకేతికత తదితర అంశాలపై పరస్పర అవగాహనతో వ్యాపార ఒప్పందం కోసం ముందుకు పోతుందన్నారు.