
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘెర పరాజయం చవి చూసింది వైఎస్సార్ పార్టీ. వైనాట్ 175 అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన ఆ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. నిబంధనల మేరకు ప్రతిపక్ష హోదా దక్కలేదు. దీంతో అప్పటి నుంచి అసెంబ్లీకి రావడం మానేశారు జగన్. కానీ అనూహ్యంగా సోమవారం అసెంబ్లీలో అడుగు పెట్టారు.
అసెంబ్లీకి వచ్చేది లేదని పదే పదే చెప్పిన జగన్.. ఎట్టకేలకు సభకు వచ్చారు. సోమవారం ప్రారంభమైన సభకు వచ్చిన ఆయన.. వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. తొలి రోజు సభకు వచ్చిన జగన్ ఆయన ఎమ్మెల్యేలు.. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి అడుగడుగునా అడ్డు పడ్డారు. బిగ్గరగా నినాదా లు చేశారు. ఒకానొక దశలో పోడియంను కూడా ముట్టడించారు. దీంతో సభలో పెద్ద ఎత్తున వివాదం రేగింది. గవర్నర్ ప్రసంగానికి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. చివరకు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి బయటకు వెళ్లారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇక నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తేల్చి చెప్పారు.
ప్రతిపక్షంలో ఉన్నవారు.. సహజంగానే అసెంబ్లీలో ఇలానే వ్యవహరిస్తున్నారు. పార్లమెంటు నుంచి అసెంబ్లీల వరకు కూడా ఇలానే ప్రతిపక్షం నేతలు వ్యవహరిస్తూ.. తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తు న్నారు. అయితే.. ఇలా.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే విషయంలో విపక్షాలు.. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తాయి. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను సభలో ప్రస్తావించి.. ప్రభుత్వం తాలూకు గవర్న ర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి..
వ్యక్తిగత అజెండాలను పక్కన పెట్టి.. ప్రజా సమస్యలపై చర్చించి ఉంటే.. గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న అంశాలపైనే తమ పాలనలో జరిగిన విషయాలపై దుయ్యబట్టినప్పుడు అయినా.. వైసీపీ స్పందించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యక్తిగత లబ్ధి కోసం.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరని నిలదీయడానికి మాత్రమే పరిమితం అయింది. మరి ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారో చూడాలి.