
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్.. తనతో పాటు మిగతా 10 మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని వచ్చారు. ఈ సందర్భంగా... తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సభలో నినాదాలు చేశారు. అనంతరం గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసి, బయటకు వెళ్లిపోయారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచీ జగన్ పై రాజకీయ పోరాటంతో పాటు వ్యక్తిగత విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.
తాజాగా జగన్ అసెంబ్లీ వాకౌట్ పై తనదైన శైలిలో స్పందించారు. జనాలు ఛీ కొడుతున్నా వైసీపీ అధ్యక్షులు జగన్ తీరు మాత్రం మారలేదని మొదలు పెట్టారు. అనంతరం.. "11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చింది..? ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా..? సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా..?"
"కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా..?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజల శ్రేయస్సు కంటే.. మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారని షర్మిల మండిపడ్డారు. ప్రజా సమస్యల మీద చిత్తశుద్ది ఉంటే .. మంగళవారం నుంచి అసెంబ్లీకి వెళ్ళాలని కోరుతున్నట్లు తెలిపారు.
సభకు వెళ్ళే దమ్ము లేకపోతే తక్షణం పదవులకు రాజీనామాలు చేయాలని షర్మిల మరోసారి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. గవర్నర్ ప్రసంగంపై షర్మిల విరుచుకుపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో పసలేదని.. దిశా-నిర్దేశం అంతకన్నా లేదని.. అన్ని అర్థసత్యాలు, పూర్తి అబద్ధాలని షర్మిల విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో ఎక్కడా సూపర్ సిక్స్ హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన లేదని ఆమె అన్నారు. గ్యాస్ సిలిండర్ తప్ప మిగతా 5 హామీలపై స్పష్టత లేదని.... బాబు విజన్ 2047కి దమ్ము లేదని.. 8 నెలల పాలన కాలయాపన తప్పా ఎక్కడా కమిటిమెంట్ కనిపించలేదని షర్మిల నిప్పులు చెరిగారు.