రాజకీయాల్లో కొందరు తమ వ్యవహార శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రత్యర్థులపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటే ప్రత్యర్థులైన వారు చేసిన పనులు మెచ్చుకుంటూ మరికొందరు వార్తల్లో నిలుస్తుంటారు. ఈ కోవకి చెందిన వారే కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ శశి థరూర్.   ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. జరిగే పరిణామాలు, ఆయన కాంగ్రెస్ పార్టీలో స్థానం బలహీనమవుతున్నాయనే ఊహాగానాలకు బలాన్ని చేకూర్చుతున్నాయి.



త్వరలోనే ఆయన పార్టీని వీడవచ్చనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మలయాళ భాషా పాడ్‌కాస్ట్ 'వర్తమానం' టీజర్‌లో థరూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. "పార్టీ నన్ను కోరుకుంటే నేను అందుబాటులో ఉంటాను. లేకపోతే నాకు స్వంత పనులు ఉన్నాయి.  మీరు నన్ను పార్టీకి మాత్రమే పరిమితం చేయలేరు. నాకు నా పుస్తకాలు, ప్రసంగాలు, ప్రపంచవ్యాప్తంగా చర్చల కోసం ఆహ్వానాలు ఉన్నాయి," అని ఆయన పేర్కొన్నారు.  



అంతేకాకుండా, కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం కూడా సంచలనంగా మారింది.  కేరళలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ , లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్  కావడంతో థరూర్ లెఫ్ట్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.  ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆయన ప్రశంసలను స్వాగతించింది.  ఇది ఆయన భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై మరింత ఊహాగానాలకు తావిస్తోంది.


కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహంపై కూడా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. 2024 జాతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంతవరకు పుంజుకున్నా, అనుబంధ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ప్రదర్శన చూపింది.  కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని, లేనిపక్షంలో మూడోసారి ప్రతిపక్షంలోనే ఉండాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.   కానీ ఆయన తాజా వ్యాఖ్యలు, రాజకీయ రంగంలో పెను మార్పులకు దారి తీసే అవకాశం కల్పిస్తున్నాయి. మరి ఆయన పార్టీని వీడుతారా  లేదా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: