విపక్ష హోదా కావాలంటున్న జగన్ ను టార్గెట్ చేస్తూ కూటమి నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.  ఈ ఐదేళ్లు జగన్ ప్రతిపక్ష హోదా అన్న పదం మరచిపోవాల్సిందేనని తేల్చేశారు. ఇక ఓట్ల శాతం చూసైనా హోదా ఇవ్వాలన్న ప్రతిపాదనకు గోదావరి వెటకారంతో సమాధానం చెప్పారు పవన్. ఆయన తొలిసారిగా గోదావరి చమత్కారం కనిపించింది.  


ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్న వైసీపీ అధినేత జగన్ తన పంతం నెరవేర్చుకోవాలంటే జర్మనీ వెళ్లడం ఒక్కటే మార్గమని సేనాని వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.  ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై పంచులేశారు.  గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతం బీఏసీ సమావేశానికి హాజరైన పవన్ మధ్యలో మీడియాతో కాసేపు మాట్లాడారు.


ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేసినా వైసీపీ ప్రతిపక్ష హోదా కావాలంటూ మారం చేయడం సరికాదన్నారు. మీరేమో సీట్లు లెక్కచెప్పి హోదా ఇవ్వలేమంటున్నారు.  వారేమో ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నందున తామే ప్రతిపక్షం అంటున్నారు'' అంటూ విలేకర్లు ప్రశ్నించడంతో పవన్ తనదైన స్టైల్ లో పంచులేశారు.  ఓట్ల శాతం ఆధారంగా సీట్లు వచ్చే పద్ధతి మన దేశంలో లేదని.. అలా కావాలంటే జర్మనీ వెళ్లాల్సివుంటుందని చమత్కరించారు.  


జర్మనీలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయని, అక్కడ ఓట్ల శాతం బట్టి సీట్లు కేటాయిస్తారని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు.  5 శాతం కన్నా తక్కువ వచ్చిన వారి ఓట్లు ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీకి కలిపి సీట్లు కేటాయిస్తారని చెప్పారు. మన దేశంలో అలాంటి పద్ధతి లేనందున జగన్ జర్మనీ వెళ్లడం బెటర్ అంటూ సలహా ఇచ్చారు పవన్.  డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు అందరినీ నవ్వు తెప్పించాయి.  దీంతో పవన్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: