కాంగ్రెస్ సీనియర్ నేత, క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు చిన్నారెడ్డి ఇటీవల వనపర్తిలో ఆవేదనతో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వం, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న విధానానికి అద్దం పడుతున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు అంటున్నారు. చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు  స్పందించారు. ఇందిరమ్మ రాజ్యం.. పోలీసు రాజ్యమైందని, బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి నాయకుల దాకా అక్రమ కేసులు, వేధింపులు సర్వసాధారాణం అయ్యాయన్న తమ ఆరోపణలు వాస్తవమని చిన్నారెడ్డి వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు.

 
పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి కావలి కారుల్లాగా పని చేస్తున్నారు...  ఎమ్మెల్యే కేసు పెట్టమంటే పెట్టాలి, లేదంటే లేదు అని చిన్నారెడ్డి అన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్నది నిజమేనని నాడు జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, నేడు వనపర్తిలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు తేటతెల్లం చేస్తున్నాయిని హరీశ్ రావు అన్నారు.


మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని చిన్నారెడ్డి చెప్పారన్న మాజీమంత్రి... ఓట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు 5 నుంచి 10లక్షల వరకు ఇస్తామని హామి ఇచ్చి, రెండున్నర లక్షలు మాత్రమే ఇచ్చారని బట్టబయలు చేశారని హరీశ్ రావు వివరించారు.


ఈడీ, సీబీఐ, ఐటీ, ఎన్నికల కమిషన్లు ఎందుకు ఈ విషయంపై నోరు మెదపడం లేదని... సుమోటోగా తీసుకొని కేసులు ఎందుకు పెట్టడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులపై నిరాధారమైన కేసులు పెట్టటంలో చూపించే అత్యుత్సాహం ఆధారాలు ఉన్న..కేబినెట్ ర్యాంకులో ఉన్న కాంగ్రెస్ నాయకుడే చెబుతున్నా ఎందుకు పెట్టడం లేదని అడిగారు. కాంగ్రెస్ మార్కు ప్రజా పాలన, రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా అన్న హరీశ్ రావు... రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఏ విధంగా సమర్థిస్తారు? ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ ల చీకటి ఒప్పందానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని అడిగారు. వెంటనే కేసులు పెట్టి, విచారణ జరపాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: