
తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల చోట్ల ఉప ఎన్నికలు కచ్ఛితంగా వస్తాయని బీఆర్ఎస్ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ మేరకు ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. ఇక దీనిపై త్వరలోనే సుప్రీం కోర్టు తమ నిర్ణయాన్ని వెలువర్చనుంది. ఈక్రమంలో గద్వాల ఎమ్మెల్యే తీరు హాట్ టాపిక్ గా మారింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన పార్టీ మార్పు గురించి వస్తున్న ఊహాగానాలను ఖండించారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని స్పష్టంగా తెలిపారు. కొందరు అసత్య ప్రచారం చేస్తూ తనను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని, ఇది పూర్తిగా అవాస్తవమని ఆయన ధృవీకరించారు. తన రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ఉద్దేశంతో దుష్ప్రచారం సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ తప్పుడు ప్రచారంపై గద్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. తనను కావాలనే టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తల్లో అయోమయాన్ని సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
కృష్ణమోహన్ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి, ఆ తర్వాత తిరిగి బీఆర్ఎస్లో చేరారు. ఇదే పరిస్థితిని అవకాశంగా మార్చుకుని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుష్ప్రచారాలను సహించబోనని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇదిలా ఉండగా గతంలో ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. తర్వాత జరిగిన పరిణామాలతో మళ్లీ బీఆర్ఎస్ లో వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో కలగజేసుకున్న మంత్రి జూపల్లి ఆయన్ను సముదాయించి సీఎం రేవంత్ రెడ్డికి తీసుకెళ్లి పార్టీలో కొనసాగేలా చేశారు. మళ్లీ తాజాగా ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో.