
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అరెస్టుల పర్వం మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన నేతలపై రెచ్చిపోయిన సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ముందు కేసులు పెట్టింది. దీంతో వైసీపీ సోషల్ మీడియా ఒక్కసారిగా మూగబోయింది. ఆ తర్వాత మాజీ ఎంపీ నందిగం సురేష్ లాంటి వారి మీద కేసులు పడ్డాయి. కొన్ని నెలల పాటు జైలు వాసం ఆయన చేశారు.
ఆ తర్వాత పేర్ని నాని కుటుంబం మీద కేసులు పడ్డాయి. వీరి అరెస్టుల ఊహాగానాల సాగుతుండగానే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద కేసులు అరెస్టుల పర్వం సాగిపోయింది. ఆయన రిమాండ్ పూర్తి అయి.. జైలులో వేయగానే పోసాని క్రిష్ణ మురళి కూడా అరెస్టు అయ్యారు. గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై చేసిన వ్యక్తిగత విమర్శల పై రాష్ట్రంలో దాఖలైన ఫిర్యాదుల ఆధారంగా పోసానిని హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఇక తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మీద కూడా కేసుల ఉచ్చు బిగుస్తోంది. పోసాని తరువాత అతి పెద్ద అరెస్టు తో వైసీపీలో రాజకీయ భూకంపాన్ని సృష్టించేలా ప్లాన్ అయితే సాగుతోందని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇక గోరంట్ల మీద వరసగా కేసులు నమోదు అవుతున్నాయి. తాను సూపర్ సిక్స్ లపై ప్రశ్నించింనందుకే తన పైన కేసులు నమోదు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా.. గత ప్రభుత్వంలో తమను ఇబ్బంది పెట్టిన వారిని కూటమి నేతలు అరెస్టు చేస్తున్నారనేది అందరూ ఒప్పుకోవాల్సిన వాస్తవం.
నిజానికి వల్లభనేని వంశీ తరువాత మాజీ మంత్రి కొడాలి నాని అనుకున్నారు. కానీ సీన్ అటు నుంచి హైదరాబాద్ కి మారింది. పోసాని మీదకే వెళ్ళింది. ఈ రాజకీయాలకు ఒక దండం అని చెప్పి ఫుల్ సైలెంట్ అయిన పోసాని కలలో కూడా ఊహించని విధంగా ఈ అరెస్టు సాగింది. ఆ తర్వాత ఎవరు అనే చర్చ ఇప్పుడు సాగుతోంది. పోసాని రిమాండ్ ఆధారంగా మరికొందరు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం జరుగుతోందని విశ్లేషకులు అంటుననారు. వైసీపీ దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుంది. ఏమి ఆలోచిస్తుంది అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి.