రాజకీయాల్లో సాధారణంగా విధేయులకు వీరతాళ్లు వేస్తారు. నాయకులను మెచ్చుకునేవారిని పొగిడే వారిని అన్ని విధాలా సహకరించే వారికి రాజకీయాల్లో పదవులు దక్కడం కామనే. పైగా కాంగ్రెస్ లో సుదీర్ఘకాలంగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది.  ఇక పార్టీ ఇన్‌ఛార్జుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  వారికి ఖరీదైన కార్లు, స్టార్ హోటళ్లు ఇలా వారికి రాచమర్యాదలు చేస్తారు.


కానీ ఇప్పుడు హంగూలేదు.. ఆర్భాటమూ లేదు. భుజానికి ఓ హ్యాండ్ బ్యాగు… వీపున చిన్న లగేజీ బ్యాగు…స్పెషల్‌ ఫ్లయిట్‌ లేదు.. కాన్వాయ్‌, సెక్యూరిటీ అసలే లేదు. ఓ సాధారణ కాంగ్రెస్‌ కార్యకర్తలా హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్‌ కొత్త ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్.  వచ్చీ రావడంలోనే తన మార్క్‌ ఏంటో చూపించారు. ఫ్లెక్సీలకు ఫోజులిస్తే కాదు… ప్రజల్లో ఉంటూ సిన్సియర్‌గా పని చేయాలన్నారు. పైరవీలు చేయడం కాదు… ఆ ఆలోచనే మైండ్‌ నుంచి తీసేయాలన్న హింట్‌ ఇచ్చారు. గ్రౌండ్ లెవల్‌లో పనిచేసేవారికే పదవులు వస్తాయని క్లిస్టర్ క్లియర్‌గా చెప్పేశారు.   మనిషి సాఫ్ట్‌గా కనిపించినప్పటికీ… పార్టీ విషయంలో వెరీ సీరియస్‌ అని తెలిసేలా ఫస్ట్‌ స్పీచ్‌తోనే అదరగొట్టారు మీనాక్షి నటరాజన్..


హైదరాబాద్‌లో ల్యాండ్‌ అవ్వగానే… పార్టీ వ్యవహారాలపై ఆరా తీశారు మీనాక్షి.  సీనియర్‌, జూనియర్ తేడా లేకుండా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.   విభేదాలు, వివాదాలు సృష్టించేవారిపై కఠిన చర్యలు తప్పవని సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు. టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నా ఆమె… కష్టపడ్డ ప్రతిఒక్కరిని గుర్తిస్తామని స్పష్టం చేశారు.



సీఎం రేవంత్‌ రెడ్డి సైతం… విస్తృతస్థాయి సమావేశంలో సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. నామినేటెడ్ పోస్టులు వచ్చిన వారు పార్టీకోసం పనిచేయట్లేదన్న ఆయన… పోస్టులు రానివారు పదవి రాలేదని పనిచేయడం మానేశారంటూ ఫైర్ అయ్యారు. మంచి మైక్‌లో చెప్పాలి చెడు చెవిలో చెప్పాలన్న ఆయన… కాంగ్రెస్‌ పార్టీలో కొందరు నేతలు మాత్రం చెడు మైక్‌లో, మంచి చెవిలో చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అలాంటి వారిపై ఇక కఠినంగా ముందుకెళ్తామంటూ ఘాటుగా స్పందించారు.


మొత్తంగా… కాంగ్రెస్‌ పార్టీలో ఇంతకుముందో లెక్క ఇప్పుడో లెక్క ఉంటుందంటున్నారు నేతలు. మరి కొత్త ఇన్‌చార్జ్‌ రాకతో మున్ముందు పార్టీ ఎలా ఉండబోతోంది…? ఏమైనా మార్పులు జరుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: