
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎత్తడం లేదా ? అంటే ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే చెప్పాలి. చంద్రబాబు మంగళవారం మంత్రులు, సెక్రటరీలతో నిర్వహించిన సమావేశానికి జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాలేదు. అంతే కాదు కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రి వర్గ సమేవేశానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు. నాడు మంత్రి వర్గ సమావేశానికి రానన్న విషయంపై ఆయన ముందుగానే సమాచారం ఇచ్చారు. అయితే మంగళవారం జరిగిన మంత్రులు, సెక్రటరీ ల సమావేశానికి మాత్రం ఎలాంటి సమాచారం లేకుండానే డుమ్మా కొట్టినట్లు టాక్ ?
పంచాయతీ రాజ్ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు జనసేనకు చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జోక్యం చేసుకుని పవన్ కొద్ది రోజులుగా తీవ్రమైన నడుము నొప్పి తో బాధ పడుతున్నారని చెప్పారట. వెంటనే చంద్రబాబు జోక్యం చేసుకుని తాను పవన్ కళ్యాణ్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఆయన దొరకలేదు..ఇప్పుడు ఎలా ఉన్నారు అని మనోహర్ ను ప్రశ్నించారట. దీనిపై తెలుగు దేశం అనుకూల పత్రిక ఈనాడు లోనే వార్త వచ్చింది.
చంద్రబాబు చెప్పిన మాటలను బట్టి చూస్తేనే బాబు ఫోన్ కూడా పవన్ ఎత్తడం లేదని తెలుస్తోంది. అంటే సాక్షాత్తూ సీఎం ఫోన్ చేసినా పవన్ ఎత్తలేదు సరికదా .. తిరిగి కూడా స్పందించలేదన్న మాట. పవన్ కళ్యాణ్ సీఎం ఫోన్లు కూడా ఎత్తడం లేదు ... ఇది ఎలాంటి సంకేతాలు పంపుతుంది అని టీడీపీ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కీలక సమావేశానికి డుమ్మా కొట్టిన వెంటనే పవన్ కళ్యాణ్ మరుసటి రోజే కేరళలోని కొచ్చి వెళ్లారు. ఏదేమైనా పవన్ - చంద్రబాబు గ్యాప్ అన్నట్టుగా రకరకాల ప్రచారాలకు ఇది ఊతం ఇస్తోంది.