
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ను సమర్థవంతంగా వినియోగించుకుంది. షార్ట్ వీడియోలు, ప్రభుత్వ వ్యతిరేకత, వైఫల్యాలు, నిరుద్యోగం ఇలా పలు అంశాలను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి లబ్ధి పొందింది. దీనిని తిప్పి కొట్టడంలో అప్పటి బీఆర్ఎస్ విఫలమైంది. ఇక ఎన్నికల తర్వాత కేటీఆర్ స్వయంగా దీనిపై ప్రకటించారు. తాము సోషల్ మీడియాలో బలహీనంగా ఉన్నామని.. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కేటీఆర్ చెప్పినట్లు గానే ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా బలోపేతం అయింది. అధికార కాంగ్రెస్ ను ముప్ప తిప్పలు పెడుతోంది. అధికార చేసింది కూడా చెప్పుకోలేకపోతోంది. ప్రచారంలో వెనుకబడింది. సోషల్ మీడియా వింగ్ అయితే పూర్తిగా బలహీనపడింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియాను అందిపుచ్చుకుంటోంది.
కేటీఆర్ సైతం ప్రభుత్వ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. ఏదో ఒక ట్వీట్ రోజూ చేస్తూనే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో ఒక సందర్భంలో ఇరుకున పెడుతూనే ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఏ సోషల్ మీడియాను ఎన్నికల సమయంలో బలంగా వాడుకుందో.. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో ప్రతిపక్షం దండయాత్ర చేస్తున్నా.. తిప్పికొట్టలేక చేతులు ఎత్తేస్తోంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా దాడులను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతోందనే అభిప్రాయం కొంతమంది రాజకీయ విశ్లేషకులు, ప్రజలలో వ్యక్తమవుతోంది.
బీఆర్ఎస్, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, సోషల్ మీడియాను ఒక శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, వాగ్దానాల అమలులో లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ వ్యూహం ద్వారా ప్రజల్లో చర్చను రేకెత్తించడంలో బీఆర్ఎస్ కొంతవరకు సఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. దీనికి జవాబుగా కాంగ్రెస్ తమ సోషల్ మీడియా వ్యూహాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఇది ఇంకా పూర్తి స్థాయిలో ప్రభావవంతంగా మారలేదని విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి రాబోయే కాలంలో సీఎం రేవంత్ రెడ్డిని దీనిని ఎలా ఎదుర్కొంటారో ఆసక్తికరంగా మారింది.