
జులై 6న వెలువడిన ఈ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అనేక పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అశోక్ భూషణ్ తో కూడిన ధర్మాసనం ముందు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. డిగ్రీలు ప్రదానం చేయటానికి నిబంధనలను సూచించే అధికారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కి మాత్రమే ఉన్నందున రాష్ట్రాలు ఆ నిబంధనలను మార్చలేవన్నారు.
అంతేకాదు.. పరీక్షలు జరపకూడదన్న నిర్ణయం విద్యార్థులకు మేలుచేసేది కాదన్న మెహతా ఒకవేళ రాష్ట్రాలు గనుక ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఆ డిగ్రీలు చెల్లుబాటు కావని తేల్చి చెప్పారు. దిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయాల్లో ఫైనలియర్ పరీక్షలు రద్దు చేసిన విషయాన్ని తుషార్ మెహతా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆయా ప్రభుత్వాలు సమర్పించిన ప్రమాణపత్రంపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కౌంటర్ దాఖలు చేస్తుందని చెప్పారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.
కోర్టు ముందు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాదనలు ఇలా ఉంటే.. రాష్ట్రాల వాదనలు మరోలా ఉన్నాయి. అసలు కరోనా కారణంగా యూనివర్శిటీలు సహా విద్యాలయాలన్నీ మూతబడ్డాయి. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే జనం బయటకు రావాలని కేంద్రమే చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షల కోసం పట్టుబట్టడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి.