
పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు అడ్మిట్ కార్డుతో సహా తెచ్చుకోవాల్సిన గుర్తింపుకార్డులు, ఫేస్ మాస్క్, నీళ్ల సీసాలు, హ్యాండ్ శానిటైజర్ల గురించి విద్యార్థులకు ముందే సమాచారం అందించాలి. భౌతిక నిబంధనలు పాటించడానికి అనుగుణంగా తగిన సంఖ్యలో రిజిస్ట్రేషన్ గదులు, దస్తావేజుల పరిశీలన, అటెండెన్స్ చూసుకోవడానికి సిబ్బందిని ఏర్పాటు చేయాలి. కొవిడ్ నేపథ్యంలో పాటించాల్సిన ప్రవర్తనా నియమావళి గురించి పర్యవేక్షణ సిబ్బందికి ముందే తర్ఫీదు ఇవ్వాలి.
కొవిడ్-19 నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించే పోస్టర్లు, వీడియోలను పరీక్షాకేంద్రంల లోపల, బయట ప్రదర్శించాలి.పరీక్షా కేంద్రాల దగ్గర లోపలికి వచ్చే సమయంలో స్క్రీనింగ్ చేసేటప్పుడు ఎవరిలోనైనా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వేరుగా కూర్చోబెట్టడానికి ప్రత్యేకమైన గది కూడా ఏర్పాటు చేయాలి. వైద్య సలహా తీసుకొనేంతవరకు వారిని అందులోనే ఉంచాలి.
ఇక పరీక్ష కేంద్రం, దాని పరిసర ప్రాంతాలను పరీక్ష ప్రారంభానికి ముందు తర్వాత శానిటైజేషన్ చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు, సిబ్బంది ఎక్కువగా వెళ్లే ప్రాంతాలైన చేతులు శుభ్రం చేసుకునే ప్రాంతాలు, నీరు తాగేచోట, లెట్రీన్, బాత్ రూమ్ లను తరచుగా శుభ్రం చేయాలని అధికారులు సూచించారు.