తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్  కమిషన్  ప్రకటించింది. తాజాగా గ్రూప్‌-2 షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 783 గ్రూప్‌- 2 పోస్టుల భర్తీకి సంబంధించి తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమైతే.. ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.కానీ, డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ఈ పరీక్షలకు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళలన వ్యక్తం చేశారు. దీంతో గ్రూప్ 2 పరీక్షలను డిసెంబర్ కు రీషెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా, టీజీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. 783 గ్రూప్ 2 పరీక్షలకు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం.. రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ లో పరీక్షలు జరుగుతాయని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ఈ పరీక్షల ప్రారంభానికి వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.కాగా, జాబ్‌ క్యాలెండర్ ప్రకారం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో గ్రూప్-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పరీక్షలు జరుగుతాయి. గ్రూప్‌-1 పరీక్షలను అక్టోబర్‌లో నిర్వహిస్తామని, గ్రూప్‌-2 పరీక్షలను డిసెంబర్‌లో, గ్రూప్‌-3 పరీక్షలు నవంబర్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా ఈ ఖాళీలకు ఇప్పటికే నోటిపికేషన్లు విడుదలై ఎగ్జామ్స్ మాత్రమే నిర్వహించాల్సి ఉంది. గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్ష నిర్వహించి మెయిన్స్‌కు అర్హత పొందిన వారి జాబితాను ఇప్పటికే విడుదల చేశారు.2023 డిసెంబర్ 29న టీఎస్పీఎస్సీ తెలంగాణలో 783 గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. ఊహించినట్లుగానే లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నియామక పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 5,51,943 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: