ఆర్థిక ఇబ్బందుల వలన చదువుకోలేకపోయాడు. అయితేనేం గుండెల నిండా మెండుగా ఆత్మవిశ్వాసం ఉంది. కసితో కూడా కృషినే పెట్టుబడిగా పెట్టాడు. ఇంకేం తెలుగు నేలపై వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగాడు. అందరి కళ్లు తనవైపే తిప్పుకుంటున్నాడు. స్టార్ సెలబ్రెటీలను మించిన పబ్లిసిటీతో
ఓ వెలుగు వెలుగుతున్నాడు లలితా జ్వువెలరి అధినేత కిరణ్ కుమార్.

రాజస్థాన్ లో తాతముత్తాతలు ఉన్నా కిరణ్ కుమార్ నెల్లూరులోనే జన్మించాడు. చదువుకునే పరిస్థితులు లేకపోవడంతో కనబడిన పనల్లా చేసుకుంటూ చివరకి ఓ బంగారు షాపులో పనికి కుదిరాడు. అక్కడ నిజాయతీగా, శ్రద్దగా పనిచేసుకుంటూనే వ్యాపారంలో మెళుకువలు నేర్చుకున్నాడు. అలా రోజులు గడిచే కొద్ది కిరణ్ కుమార్ కి తానే సొంతంగా వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చింది. పూటగడవాడినికైతే ఫర్వాలేదు కానీ వ్యాపారం చేసేంత స్థోమత పెట్టుబడి తన దగ్గరలేవు.

వ్యాపారం చేసి సక్సెస్ అవుతానన్న నమ్మకం బలంగా పెంచుకున్న కిరణ్కుమార్ తన తల్లి వద్ద ఉన్న బంగారు గాజుల్ని అమ్మేసి వచ్చిన ఆ కొద్ది డబ్బులకు తోడు అమ్మ ఆశీస్సులతో వ్యాపార రంగంలోకి దిగాడు. అప్పట్లో చెన్నైల్లో ఉండే లలితా జ్వువెలరికి వెళ్లి తాను డిజైన్ చేసిన నగల్ని తీసుకెళ్లి అమ్మేవాడు. వాటిని జనం మోజు పడి కొనుక్కోవడంతో కిరణ్ కుమార్ లో ఉత్సాహం పెరిగింది. ఆ వ్యాపారంపై తిరుగులేని అభిమానాన్ని పెంచుకున్నాడు.
ఆ సమయంలో లలితా జ్వువెలర్ వద్ద నుంచే కాకుండా ఇతర బంగారు షాపుల నుంచి ఆర్డర్లు తెచ్చుకొని కొత్తకొత్త మోడళ్లలో వివిధ రకాల బంగారు ఆభరణాల్ని తయారు చేసి అమ్మేవాడు. హోమ్ డెలివరీ కూడా ఇచ్చేవాడు. వినియోగదారుల వద్ద విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలా క్రమంగా కిరణ్ పుంజుకున్నాడు. అయితే ఒకనొక సమయంలో లలితా జ్వువెలర్ యాజమాన్యం ఒడిదుడుకులతో దివాళ తీసే స్థాయికి చేరుకుంది. అమ్మేద్దామని ఆ యాజమాన్యం భావించడంతో దాన్ని కిరణ్ కుమార్ సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి కసిగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే పనిలో నిమగ్నమైపోయాడు. చూస్తుండగానే లక్షలు, కోట్లకు చేరుకుంది. 12 బ్రాంచీలు, 1800 మంది ఉద్యోగులు, 10వేలకోట్ల లాభాలతో లలితా లలితా జ్వువెలర్ విజయ పథాకంలో దూసుకెళ్తోంది.
35మందితో తాను లలితా లలితా జ్వువెలర్ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ సంస్థలో 1800మంది సిబ్బంది ఉన్నారు. అయినా తాను ఆ సంస్థకు ఎండీ, ఛైర్మన్ అని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. లలితా జ్వువెలర్ ఇంటి పెద్దగానే వ్యవహరించాడు.

తన సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న కిరణ్ తరువాత.. నెక్ట్స్ ఏంటని అడిగితే నవ్వుతూ సమాజసేవ అని చెబుతున్నాడు. 2018తరువాత తన సంపదలో సగం పూర్తిగా సేవాకార్యక్రమాలకు వినియోగిస్తానని వినయంగా చెబుతున్నారు. ఇంతకీ మీ విజయ రహస్యం ఏంటంటే తన పట్ల కొనుగోలుదారుల నమ్మకం, వ్యాపారంలో ఎన్నికష్టనష్టాలు వచ్చినా నిజాయితీని విడవకపోవడం, తక్కువ మజూరు ఛార్జీలు, తరుగు, వీలైనంత తక్కువ ధరకే బంగారాన్ని విక్రయించడంలాంటివి తన సక్సెస్ సీక్రెట్స్ అంటున్నాడు. రోజూ కేవలం మూడునాలుగు గంటలే నిద్రపోయేవాణ్ణి అని, ఆ కఠోర శ్రమే తనను పందొమ్మిదేళ్లకే కోటీశ్వరుణ్ణి చేసిందంటు చెబుతాడు. లలితా జ్యువెలరీస్ ఇప్పుడు పదివేల కోట్ల రూపాయల సామ్రాజ్యం అని చెబుతాడు.

డబ్బులెవరికీ ఊరికే రావు గుండుబాస్..!
‘‘గుండుబాస్’, ‘గుండాయన’... నా అసలు పేరేమిటో చాలామందికి తెలియకపోయినా తెలుగు టీవీ ప్రేక్షకుల్లో చాలామంది నన్నిలాగే గుర్తుపెట్టుకుంటున్నారు. ఇక నా ప్రకటనలపైన వస్తున్న పేరడీలకైతే లెక్కే లేదు. నిజానికి ఇవన్నీ నాకు కోపం తెప్పించడం లేదు... నేనూ వాటిని భలే ఎంజాయ్ చేస్తున్నా! వాటిని తయారుచేసేవాళ్లలో ఎక్కువశాతం యువతేనట. నాపైన ఎంతగా జోకులేసి నవ్వుకున్నా... యువత అన్నాక భవిష్యత్తులో గొప్ప విజయం కోసం కలలు కనకుండా ఉంటారా! ఆ కలలు నెరవేరేందుకు ఎంతోకొంత ఉపయోగపడతాయనే ఆశతోనే వాళ్ల పెద్దన్నగా నా జీవితానుభవాలను ఇలా మీతో పంచుకుంటున్నాను. ‘డబ్బులెవరికీ ఊరికే రావు...’ అంటూ టీవీల్లో కనిపించే నేను ‘విజయం ఎవరికీ ఊరికే రాదు..’ అని యువతకి చెప్పాలనుకుంటున్నా..‘‘ అంటాడు కిరణ్కుమార్
ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదగాలనే కసి, ఎదుగుతామనే నమ్మకం, నిరంతరం శ్రమ, మొండి పట్టుదల, కాస్త తెగువ, ఇంకాస్త చొరవ ఉండాలేగానీ.. ఎవరైనా తనలాగే సక్సెస్ సాధిస్తారని ఈ తరానికి స్పూర్తి నింపుతున్నాడు కిరణ్కుమార్.