గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ మినహా తెలంగాణ అంతటా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిచారు. ఇందుకు కారణం హైదరాబాద్ ను బీఆర్ఎస్ అభివృద్ధి చేయడమే. అందుకే జీహెచ్ఎంసీ పరిధిలో 20 స్థానాల్లో 13 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించారు. దీంతో రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధిపై దృష్టి సారించారు.


 భాగ్యనగరాన్ని ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేస్తున్నారు. దీనికోసం హైడ్రా ఏర్పాటు చేశారు. రెండు నెలల క్రితం ఏర్పాటు అయిన హైడ్రా ఇప్పటి వరకు 43 ఎకరాల ఆక్రమిత స్థలాన్ని స్వాధీన పరచుకుంది.


అయితే ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చే వరకు హైడ్రా గురించి.. కన్వెన్షన్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ రెండింటి గురించే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగుతుంది.


ఇదిలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి ఏకైక కుమార్తె నైశిమా రెడ్డి నిశ్చితార్థం 2015లో ఈ ఎన్‌ కన్వెన్షన్ హాల్ లోనే నిర్వహించడం గమనార్హం. నాడు రేవంత్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఓటుకు నోటు కేసులో అరెస్టు అయ్యారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థం నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. తమ కుటుంబ వేడుకగా నిర్వహించారు. దీనికి వేదికగా నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను వేదికగా చేసుకున్నారు.


2015లో కూతురి ఎంగేజ్ మెంట్ జరిగిన కన్వెన్షన్ హాల్ నే నేడు సీఎం హోదాలో అక్రమ నిర్మాణం అని రేవంత్ రెడ్డి కూల్చివేయించారు. ఆక్రమణలకు తొలగింపునకు ఏర్పాటు చేసిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది. నాగార్జున హైకోర్టు నుంచి స్టే తెచ్చుకునేలోపు మొత్తం నేలమట్టం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థం జరిగిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: