అవును, మీరు విన్నది నిజమే. చాలా దారుణం జరిగిపోయింది. అతడు చాలా కలలు కన్నాడు. అందరిలో భిన్నంగా ఉండాలని ఆశపడ్డాడు.. కష్టపడ్డాడు. ఈ క్రమంలో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పాలని కసరత్తులు చేసాడు. కానీ దారుణం జరిగిపోయింది. విషయం ఏమిటంటే? భారత దేశంలోని మీరట్ కి చెందిన "మోహిత్ కోహ్లీ" అనే సైక్లిస్ట్ దక్షిణ అమెరికా అంతటా సైకిల్‌పై అత్యంత వేగంగా 10,000 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడానికి యత్నించాడు. ఈ క్రమంలో దక్షిణ అమెరికాలోని కొలంబియా నుండి అర్జెంటీనాకు సైకిల్ పైన బయలుదేరాడు. కొలంబియా, పెరూ, ఈక్వెడార్ దాటిన తరువాత చిలీలో ఓ బస్సు ఢీకొట్టగా అక్కడికక్కడే మృతిచెందాడు. దాంతో మీరట్లో ఉన్న అతని కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

బుధవారం ఉదయం 8.30 గంటలకు (స్థానిక సమయం) పోజో అల్మోంటే కమ్యూన్‌లోని రూట్ 5లో మోహిత్ కోహ్లీని, ఓ మినీ బస్సు ఢీకొట్టిందని స్థానిక రేడియో నెట్‌వర్క్ రేడియో పౌలినా అధికారులు వెల్లడించడంతో ఈ విషయం బయటకు తెలిసింది. పోజో అల్మోంటే అగ్నిమాపక శాఖ సూపరింటెండెంట్ ఎఫ్రెయిన్ లిల్లో ప్రకారం, కోహ్లీ అక్కడికక్కడే చనిపోయినట్టు సమాచారం. కాగా ప్రమాదానికి గల కారణాలను ప్రాథమిక దర్యాప్తు చేసేందుకు, జాతీయ చట్ట అమలు సంస్థ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని తెలుస్తోంది. "దురదృష్టవశాత్తూ అతని గాయాల తీవ్రత కారణంగా అతను ప్రాణాలు కోల్పోయాడు" అని ఇక్విక్ పోలీసుల ట్రాఫిక్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ విభాగం (SIAT) నుండి లెఫ్టినెంట్ అలెక్సిస్ గుటిరెజ్ కార్బాలన్ ప్రకటించారు.

కొలంబియాలోని కార్టజేనా నుండి అర్జెంటీనాలోని ఉషుయా వరకు అత్యంత వేగవంతమైన సైక్లింగ్ రికార్డును నెలకొల్పడమే అతని లక్ష్యం అని కోహ్లీ తన సోషల్ మీడియా ఖాతాలో తన ప్రయాణానికి సంబందించిన ఓ పోస్ట్ చేయడం గమనార్హం. స్థానిక మీడియాలోని సమాచారం ప్రకారం, సదరు సైక్లిస్ట్ జనవరి 22న కార్టజేనాలో తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసాడు. అతని ప్రయాణం యొక్క టార్గెట్ 10,000 కిలోమీటర్ల దూరం కాగా అతను కొలంబియా, పెరూ, ఈక్వెడార్ మరియు ఇటీవల చిలీ గుండా ప్రయాణించాడు. ఇకపోతే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ యొక్క అధికారిక వెబ్‌సైట్ ప్రకారం చూసుకుంటే... దక్షిణ అమెరికా ప్రాంతంలో అత్యంత వేగవంతమైన ప్రయాణం చేసే రికార్డును ఆస్ట్రియాకు చెందిన "మైఖేల్ స్ట్రాసర్" పేరిట ఓ రికార్డ్ ఉంది. అతను 2018లో దానిని సాధించడానికి 41 రోజుల 41 నిమిషాలు సమయం పట్టింది. ఈ రికార్డుని బ్రేక్ చేయాలని మోహిత్ కోహ్లీ సంకల్పం చేసాడు.. కానీ, విధి అతనిని వంచించింది. కానీ అతను యుద్ధం చేస్తూ వీరమరణం పొందిన అజేయుడు అని నెటిజన్లు కొనియాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: