
రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వెంటనే అద్భుత విజయం అందుకున్న ఎమ్మెల్యేల్లో రంపచోడవరం వైసీపీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఒకరు. 2013 ఆగస్టులో రంపచోడవరం మండలం ఎర్రంపాలెంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా చేరిన ధనలక్ష్మి...2018 జూన్లో ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారు. జగన్ పాదయాత్ర సమయంలో వైసీపీలో చేరారు.
ఇక 2014 లో వైసీపీ తరుపున గెలిచిన వంతల రాజేశ్వరి, ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లిపోయారు. దీంతో 2019 ఎన్నికల్లో వైసీపీ సీటు ధనలక్ష్మికి దక్కింది. అటు టీడీపీ నుంచి రాజేశ్వరి పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో ధనలక్ష్మి దాదాపు 39 వేలపైనే మెజారిటీతో గెలిచారు. ఇలా రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే అద్భుత విజయం అందుకున్నారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ధనలక్ష్మి, నిదానంగా సమస్యల మీద అవగాహన చేసుకుంటూ ముందుకెళుతున్నారు. టీచర్ కాబట్టి త్వరగానే నియోజకవర్గంపై పట్టు తెచ్చుకున్నారు. గిరిజన ప్రాంతం కావడంతో, ఇక్కడ ఎక్కువ సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఆసుపత్రులు పెద్దగా అందుబాటులో లేవు. దానివల్ల గర్భిణీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ధనలక్ష్మి, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి చెప్పి, సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. మరో రెండేళ్లలో కొత్త ఆసుపత్రులని తీసుకురావడానికి చూస్తున్నారు.
ఇక ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ధనలక్ష్మి ముందున్నారు.అయితే గిరిజన ప్రాంతం కావడంతో, పెద్దగా అభివృద్ధి ఏమి లేదు. ఉపాధ్యాయ వృత్తి నుంచి రావడం వల్ల తొలిసారి ఎమ్మెల్యే అయినా, అసెంబ్లీలో బాగా మాట్లాడగలుగుతున్నారు. తనదైన శైలిలో ప్రతిపక్షానికి చెక్ పెడుతున్నారు. ఇక్కడ టీడీపీ తరుపున మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి పనిచేస్తున్నారు.
ఈమె ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్ గా లేరు. పైగా ఈ నియోజకర్గంలో వైసీపీ అభిమానులు ఎక్కువ. అందుకే ఇక్కడ టీడీపీకి విజయం అంత సులువుగా దక్కదు. అలాగే కమ్యూనిస్టులు కూడా ఇక్కడ బలంగానే ఉన్నారు. సీపీఐ నేత సున్నం రాజయ్య ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటారు.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే...మెజారిటీ స్థానాలు వైసీపీ గెలవడం ఖాయం. నియోజకవర్గంలో మారేడుమిల్లి, దేవీపట్నం, వై.రామవరం, అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, రాజవొమ్మంగి, కూనవరం, చింతూరు, వీర్.పురం,ఎటపాక మండలాలు ఉన్నాయి. మెజారిటీ మండలాల్లో వైసీపీ బలంగా ఉంది. కాబట్టి ఇక్కడ వైసీపీ గెలుపుకు ఎలాంటి ఢోకా లేదు.