ఏపీ రాజకీయాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుల్లో వల్లభనేని వంశీ ముందు వరుసలో ఉంటారు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వంశీ..2009 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2014 ఎన్నికల్లో చంద్రబాబు గన్నవరం సీటు ఇవ్వడంతో, వంశీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ కూడా అధికారంలోకి రావడంతో వంశీ, నియోజకవర్గాన్ని మంచిగా అభివృద్ధి చేసుకున్నారు.

సొంత డబ్బులు సైతం ఖర్చు పెట్టి రైతులకు వ్యవసాయ మోటార్లు కొనిచ్చారు. అలాగే సొంతంగా కార్యకర్తల బలాన్ని పెంచుకున్నారు. అందుకే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ గాలి ఉన్నా సరే, వంశీ విజయం సాధించారు. ఇక ఇక్కడ నుంచి వంశీ రాజకీయ వ్యూహం మారింది. అనూహ్యంగా ఆయనపై నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలు రావడంతో, వంశీ టీడీపీకి దూరం జరగడం మొదలుపెట్టారు.

పైగా రాజకీయాలకు దూరమవుతానని ప్రకటనలు కూడా చేశారు. కానీ ఊహించని విధంగా వంశీ మీడియా సమావేశం పెట్టి బాబుని, కొందరు టీడీపీ నేతలపై విమర్శలు చేసి, జగన్‌కు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక అక్కడ నుంచి వంశీ అధికారికంగా వైసీపీలో చేరకుండానే, అనధికారికంగా ఆ పార్టీ ఎమ్మెల్యేగా నడుస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో కూడా ఆయనకు కావాల్సిన పనులు అవుతున్నాయి. అభివృద్ధి జరుగుతోంది.

వంశీ ఇటు వచ్చేయడంతో గన్నవరంలో టీడీపీకి దిక్కులేకుండా పోయింది. మెజారిటీ టీడీపీ కేడర్ వంశీ వైపు వచ్చేసింది. ఒకవేళ కొత్త నాయకుడు దిగినా కూడా గన్నవరంలో టీడీపీ పరిస్థితి మెరుగుపడటం చాలా కష్టం. సొంత ఇమేజ్‌తో పాటు టీడీపీ కేడర్, జగన్ ఇమేజ్ కలవడంతో గన్నవరంలో వంశీ హవా ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఆయన్ని ఓడించడం చాలా కష్టం. మొత్తానికైతే గన్నవరంలో వంశీ వన్ మ్యాన్ షో నడుస్తుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: