
ఇదే క్రమంలో కృష్ణా జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు క్యాబినెట్ బెర్త్ ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉన్నారు. పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్లు ఉన్నారు...ఈ ముగ్గురు బదులు మరో ముగ్గురుకు అవకాశం దక్కనుంది. కాపు వర్గానికి చెందిన పేర్ని నాని సైడ్ అయితే అదే వర్గానికి చెందిన సామినేని క్యాబినెట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సామినేని టీడీపీ వేవ్ ఉన్న 1999 ఎన్నికల్లోనే జగ్గయ్యపేటలో కాంగ్రెస్ తరుపున నిలబడి విజయం సాధించారు. 2004లో సైతం సత్తా చాటారు. 2009లో ఓడిపోయిన సామినేని... 2014లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2019 ఎన్నికల్లో మాత్రం జగన్ వేవ్లో భాను సూపర్ విక్టరీ కొట్టారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడంతో మంత్రిపదవి వస్తుందని ఆశ పెట్టుకున్నారు...కాకపోతే సామాజికవర్గాల సమీకరణాల్లో భాగంగా మొదటి విడతలో ఛాన్స్ దక్కలేదు. ప్రభుత్వ విప్ పదవి మాత్రం దక్కగా, ఈ సారి మాత్రం సామినేనికి బెర్త్ ఖాయమైపోయిందని టాక్. ఇక ఎమ్మెల్యేగా కూడా సామినేని పర్వాలేదనిపించేలా పనిచేస్తున్నారు.
జగ్గయ్యపేటలో ప్రభుత్వం తరుపున జరిగే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. ఇటీవల స్థానిక ఎన్నికల పోరులో కూడా వైసీపీకి అద్భుత విజయాలు అందించారు. అటు టీడీపీ నేత శ్రీరామ్ తాతయ్య కూడా యాక్టివ్గానే ఉన్నారు. జగ్గయ్యపేట ఎలాగో టీడీపీకి కంచుకోటగా ఉంది. తాతయ్య ఇంకాస్త గట్టిగా కష్టపడితే జగ్గయ్యపేటలో టీడీపీ పుంజుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో సామినేనికి గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.