టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకు పోతున్నాడు. గతేడాది మహర్షి, అంతకు ముందు భరత్ అనే నేను, ఈ సంక్రాంతి సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుస హిట్లతో దూసుకు పోతున్నాడు. సరిలేరు లాంటి సినిమా యావరేజ్ కంటెంట్తో కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా రు. 200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మహేష్ వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు.
మహేష్ తన నెక్ట్స్ ప్రాజెక్టుల విషయంలో ఇప్పటికే దర్శకులను లాక్ చేసినట్టు కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మహేష్ కాంపౌండ్ నుంచి వస్తోన్న లీకుల ప్రకారం మహేష్ ఎంబీ 28-ఎంబీ 29- ఎంబీ30 చిత్రాల దర్శకులను కూడా లైన్ లోకి తెచ్చారని ప్రచారం సాగుతోంది. వచ్చే రెండు మూడేళ్ల పాటు మహేష్కు ఈ సినిమాలు చేసేందుకే టైం సరిపోతుందట. మహేష్ 28వ ప్రాజెక్టు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో.. 29ని అనీల్ రావిపూడితో.. 30 చిత్రాన్ని కొరటాల శివతో చేయనున్నాడుట.
ఇప్పటికే ఈ ముగ్గురు డైరెక్టర్లతో మహేష్ సినిమాలు చేశాడు. త్రివిక్రమ్తో అతడు, ఖలేజా చేశాడు. అనిల్తో ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమా చేశాడు. ఇక కొరటాలతో శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కొట్టాడు. మహేష్ 28వ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్ తో కలిసి జీఎంబీ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. మిగతా రెండు సినిమాలకు సంబంధించి నిర్మాణ సంస్థలు ఖరారు కావాల్సి ఉంది.
ఇక అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగాతో మహేష్ సినిమా ఉంటుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నా అవి మాత్రం నెరవేరడం లేదు. స్క్రిప్ట్ కుదరకపోవడంతో సందీప్ ని మహేష్ పూర్తిగా పక్కన పెట్టేశాడనే అర్థమవుతోంది. ఏదేమైనా మహేష్ వరుస పెట్టి సినిమాలు చేస్తుండడం ఆయన అభిమానుల్లో ఎక్కడా లేని జోష్ నింపుతోంది.