ఆనంద్.. ఓ మంచి కాఫీ లాంటి అబ్బాయి ను చిత్రీకరిస్తున్న సమయంలోనే గోదావరి కథను రాసుకున్నారు శేఖర్ కమ్ముల. గోదావరిని ఇతివృత్తంగా ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందని ఆలోచించారట. ఇక వెంటనే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నారు. తన మనసులోని మాటను ఆనంద్ హీరోయిన్ కమలినీ ముఖర్జీకి చెప్పగా.. ఆ కథకు.. పాత్రకు కమలిని ఫిదా అయ్యారు. వెంటనే ఈ సినిమా లో కథానాయికగా నటిస్తానని చెప్పడంతో ఆలోచిద్దామని అన్నారట. ఆనంద్ విడుదలై సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత గోదావరి చిత్రీకరణ కోసం పనులు మొదలుపెట్టారట శేఖర్ కమ్ముల.
ముందుగా ఈ సినిమా కు కథను సిద్ధం చేసి.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, గోపీచంద్ వీరిలో ఎవరో ఒకరితో ను తెరకెక్కించాలనుకున్నారట. కానీ ఆ సమయంలో అందరూ బిజీగా ఉండడంతో ఈ మూవీ సుమంత్ వద్దకు చేరింది. ఇక హీరోయిన్ ఎవరా అని ఆలోచిస్తున్న సమయంలోనే ఆనంద్ హీరోయిన్ ఈ కథకు సెట్ అవుతుందని చెప్పడంతో కథానాయికగా కమలినీ ఫిక్స్ అయ్యింది. ఇందులో రామ్, సీత పాత్రలలో సుమంత్, కమలినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా సీత పాత్రను శేఖర్ కమ్ముల డిజైన్ చేసిన తీరు యువతను కట్టిపడేసింది. ఇందులోని కోటిగాడు (కుక్క)కు శేఖర్ కమ్ముల వాయిస్ ఓవర్ అందించారట. కంటెంట్ పరంగానే కాకుండా మ్యూజిక్ పరంగానూ సూపర్ హిట్ అయ్యింది గోదావరి.