తెలుగులో ఎంతమంది టాప్ స్టార్స్ ఉన్నా కానీ తెలుగు సినిమా అంటే ముందుగా అందరికి గుర్తుకొచ్చేది మాత్రం సీనియర్ ఎన్టీఆర్. ఆయన ఒక లెజెండ్. దేవుడి పాత్రలు అంటే అందరికి మదిలో మెదిలే రూపం ఎన్టీఆర్. ఆయన సినిమాలు చూసిన తర్వాత భగవంతుడు అంటే ఎలా ఉంటాడో తెలుగు ప్రజలు అర్ధం చేసుకున్నారు.ముఖ్యంగా శ్రీకృష్ణుడు, శ్రీరాముడు పాత్రలకి ఎన్టీఆర్ ప్రాణం పోశారని చెప్పాలి. ఇప్పటికి చాలా మంది ఎన్టీఆర్ లోనే రాముడు ఇంకా కృష్ణుడిని చూసుకుంటారు. మన తెలుగు రాష్ట్రాలలో ఆయన విగ్రహాలు చాలా చోట్ల ఉంటాయి. తెలుగు ప్రజలకి బాగా కనెక్ట్ కావడం వలన ఎన్టీఆర్ ని కారణజన్ముడుగా తెలుగు ప్రజలు అందరూ భావిస్తారు. ఎన్టీఆర్ మరణాంతరం యమదొంగ సినిమాలో రాజమౌళి సీజీలో సీనియర్ ఎన్టీఆర్ ని తెరపై చూపించి ప్రేక్షకులకి కొత్త అనుభూతిని అందించారు. తాత మనవాళ్ళు కలిసి సంభాషించుకున్నట్లు ప్రేక్షకులకు చూపించారు.అప్పుడు ఆయనని మరోసారి అందరికి గుర్తుచేశారు. మరోసారి సిల్వర్ స్క్రీన్ పై సీనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారా అంటే అవుననే మాట బలంగా వినిపిస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ చేసిన కల్కి 2898ఏడీ మూవీలో సీనియర్ ఎన్టీఆర్ ని చూపించబోతున్నారంటూ ప్రచారం నడుస్తోంది. 


ఈ మూవీలో కురుక్షేత్ర యుద్ధం నాటి ఎపిసోడ్స్ కొన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఆ ఎపిసోడ్స్ లో శ్రీకృష్ణుడి పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ కనిపిస్తారనే మాట చాలా బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన అయితేనే ప్రేక్షకులకి సరికొత్త అనుభూతి అందించినట్లు అవుతుందని వర్చువల్ గా సీనియర్ ఎన్టీఆర్ ని తెరపై చూపించారట. అశ్వినీదత్ సీనియర్ ఎన్టీఆర్ కి వీరాభిమాని. అందుకే ఆయన బ్యానర్ లో కూడా కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ ఫోటో ఉంటుంది. ఎన్టీఆర్ కి ట్రిబ్యూట్ గా కల్కి 2898ఏడీ సినిమాలో ఆయన్ని చూపించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. దీనిని సర్ప్రైజ్ ఎలిమెంట్ గా ఉంచి ప్రేక్షకులకి థ్రిల్ ఫిల్ అందించాలనే ఉద్దేశ్యంతోనే మూవీ యూనిట్ లుక్ రివీల్ చేయలేదని టాక్ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. కురుక్షేత్ర సంగ్రామం సమయంలో అశ్వద్ధామ పాత్రని కల్కి మూవీలో నాగ్ అశ్విన్ ఆవిష్కరించారు. ఈ లుక్ కోసం టెక్నాలజీని ఉపయోగించి అమితాబ్ బచ్చన్ ఫేస్ లో ఏజ్ తగ్గించి చూపించారు. ఇంకా అలాగే కృష్ణుడి పాత్రలో సీనియర్ ఎన్టీఆర్ ని చూపించొచ్చని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: