కన్నడ స్టార్ హీరో యష్ అంటే తెలియని వారుండరు. ‘సలాం రాఖీ భాయ్’ అంటూ యావత్ ప్రపంచ సినీ ప్రియుల్ని విపరీతంగా అలరించాడు. యష్‌గా కంటే రాఖీ భాయ్‌గానే అందరి మెదల్లో గుర్తుండిపోయాడు. అతడు హీరోగా నటించిన ‘కేజీఎఫ్ 1, 2’ సినిమాలు బాక్సాఫీసును షేక్ చేశాయి. అప్పటి వరకు యష్ ఎవరో తెలియని వారికి కూడా కేజీఎఫ్ సినిమాలు అతడి పేరును మారుమోగించాయి. దీంతో యష్‌కి ఊహించని రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయింది. అయితే ఈ హీరో ‘కేజీఎఫ్’ సినిమాల తర్వాత మరే మూవీని చేయలేదు.దీంతో ఈ సారి యష్ ఇంకెలాంటి ప్రాజెక్టును సెలెక్ట్ చేసుకుంటాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడు తన కెరీర్‌లో 19వ సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశాడు. మలయాళ నటి, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే సినిమా చేస్తున్నట్లు తెలిపాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో తాజాగా ప్రారంభమైంది.తాజా అప్‌డేట్ ప్రకారం టాక్సిక్ చిత్రీకరణ అధికారికంగా మొదలైంది. పూజా కార్యక్రమంతో ఈ సినిమా షూటింగ్ షురూ అయిందంటూ యష్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమం ఫొటోలను కూడా పంచుకున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్సిక్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలస్తోంది. ఇక యష్ సోదరిగా నయనతార కనిపించబోతున్నట్లు టాక్. 

అలానే మరో హీరోయిన్ తారా సుతారియా కీలక పాత్రలో నటిస్తుండగా మరో బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి నెగెటివ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. గీతూ మోహన్‌దాస్ లాంటి డైరెక్టర్‌కి ఈ రేంజ్ స్టార్ క్యాస్టింగ్ దక్కడంతో సినిమా అదిరిపోతుందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.కాగా ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది 2024 ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది.అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా తీస్తున్నట్లు కూడా టాక్ ఉంది. కానీ దీనిపై మూవీ టీమ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.మరోవైపు యష్ ఈ చిత్రంతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీతో కూడా ఓ ప్రాజెక్టు చేస్తున్నారు. నితీష్ తీస్తున్న రామాయణంలో యష్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రావణుడి పాత్ర కోసం యష్‌ను మూవీ టీమ్ సంప్రదించినట్లు సమాచారం. ఇందుకోసం యష్ కూడా భారీ రెమ్యూనరేషన్ కూడా అడిగారంటూ టాక్. ఈ సినిమాలో సీతామాతగా సాయి పల్లవి నటిస్తుండగా శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ యాక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాలో యష్ పాత్రపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే యష్ కోసం టాలీవుడ్ టూ బాలీవుడ్ దర్శకులు చాలా మంది ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: