భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకే ఒక సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన నటి భాగ్యశ్రీ. ఈ భామ ఓవర్ నైట్ లోనే స్టార్ గా ఎదిగింది. రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. మిస్టర్ బచ్చన్ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఈ బ్యూటీకి మాత్రం మంచి క్రేజ్ దక్కింది. ఈ సినిమాలో తనదైన అందం, నటనతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. మిస్టర్ బచ్చన్ లో తన నటనతో ఆకట్టుకున్నటువంటి ఈ ముద్దుగుమ్మ అవకాశాలను అందుకుంటూ టాప్ హీరోయిన్గా ఎదుగుతున్నారు.


తాజాగా ఈ అమ్మడు అభిమానులకు థాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టారు. "నన్ను మీ ఇంటి మనిషిగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. జిక్కి పాత్రపై మీరు చూపిన ప్రేమాభిమానాలు ఊహించలేదు. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నా తర్వాత ప్రాజెక్టుల గురించి మీతో పంచుకోవడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తానంటూ" రాసుకొచ్చింది.  ఇటీవల విడుదలైన మిస్టర్ బచ్చన్ లో భాగ్యశ్రీ తన డ్యాన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది.


సినిమా సెట్స్ పైన ఉండగానే విజయ్ దేవరకొండ సినిమాలో అవకాశాన్ని అందుకుంది. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న "వీడీ 12" లో విజయ్ సరసన హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ్రీలంకలో శరవేగంగా జరుగుతోంది. ఇందులో విజయ్ దేవరకొండ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. విజయ్ తో పాటు దుల్కర్ సల్మాన్ సినిమాకు భాగ్యశ్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.


రవి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా కోసం హీరోయిన్ గా భాగ్యశ్రీని ఎంచుకున్నట్లు టాక్. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు పూర్తయినట్టు తెలుస్తోంది. ఇది ఒక భిన్నమైన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సిద్ధం కానుంది. ఇక త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా విజయ్‌తో నటించడం అంటే భాగ్య శ్రీకి బాగా ఇష్టమట.

మరింత సమాచారం తెలుసుకోండి: