కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 2024లో కెప్టెన్ మిల్లర్, రాయన్ మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ప్రస్తుతం కుబేర చిత్రం చేస్తున్నారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన ధనుష్ పోస్టర్లు మంచి బజ్ క్రియేట్ చేశాయి. సోషల్ డ్రామాగా రూపొందుతున్న కుబేర వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ధనుష్ హీరోగా నటిస్తూనే.. డైరెక్టర్ గా కూడా సినిమాలు తెరకెక్కిస్తారన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన రాయన్ కు ఆయన స్వీయ దర్శకత్వం వహించారు. రిలీజ్ కు ముందు భారీ అంచనాలు నెలకొల్పిన రాయన్ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి వ్యూస్ ను దక్కించుకుంటుంది.కానీ రాయన్ విషయంలో ధనుష్ డైరెక్షన్ కు కొందరు మిక్స్ డ్ రివ్యూస్ ఇచ్చారు. ఇప్పుడు ధనుష్ డైరెక్షన్ లో నిలవుకు ఎన్మెల్ ఎన్నడి కోబమ్  మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తవ్వగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుతున్నారు మేకర్స్. త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ధనుష్ దర్శకత్వంలో అది మూడో సినిమా కాగా.. ఇప్పుడు నాలుగో మూవీకి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.

అరుణ్ విజయ్ హీరోగా కొత్త చిత్రాన్ని ధనుష్ త్వరలోనే మొదలు పెట్టనున్నారని సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ సినిమాలో ధనుష్ కూడా కీలక పాత్ర పోషించనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ధనుష్ డైరెక్టర్ గా ఇప్పటి వరకు భారీ హిట్ అందుకోలేదు. దీంతో ఆయన తన సోదరుడు సెల్వరాఘవన్ లాగా టాప్ డైరెక్టర్ కాలేకపోయారని రీసెంట్ గా కొందరు నెట్టింట కామెంట్లు పెట్టారు.ఇప్పుడు ధనుష్ డైరెక్షన్ లో నాలుగో సినిమా రానున్న విషయం వైరల్ గా మారడంతో.. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఒక టాప్ హీరో.. మూవీస్ కు దర్శకత్వం వహించాల్సిన అవసరం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. దర్శకత్వానికి అయ్యే సమయాన్ని స్క్రిప్టుల ఎంపికకు కేటాయించాలని సూచిస్తున్నారు. తద్వారా మంచి సినిమాల్లో నటించాలని కోరుతున్నారు. డైరెక్షన్ వదిలేయండని అంటున్నారు! మరి ధనుష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో? ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: