మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. స్టైలిష్ డైరెక్టర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా… ప్రతినాయక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మొదటి పార్టును సెప్టెంబర్ 27వ తేదీన తెలుగుతోపాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఇదిలావుండగా ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన సినిమా కావడంతో ముందు నుంచీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమాలో హైలైట్‌ అంటూ ముంబయిలో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ అంచనాలు రెట్టింపు చేశారు. 

దీనికి తోడు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన మూడు పాటలు, ట్రైలర్ కు పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఈ నేపథ్యంలో సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. దేవర రన్‌టైమ్‌ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లుగా ఉంది.ఈ నేపథ్యంలోనే నార్త్‌ అమెరికాలో అత్యంత వేగంగా టికెట్ల ప్రీ సేల్‌ ద్వారానే వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘దేవర’ నిలిచిన సంగతి తెలిసిందే. ట్రైలర్‌ కూడా రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది.ఇదిలావుండగా దేవర మూవీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అదేమిటంటే లాస్ ఏంజెల్స్ లోని బియాండ్ ఫెస్ట్ లో ఈ మూవీని ప్రదర్శించనున్నారు. ఈ నెల 26న సాయంత్రం 6:30గంటలకు ప్రఖ్యాత ఈజీప్షియన్ థియేటర్ లో షో వేయనున్నారు. ఈ విషయాన్నీ సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రీమియర్ రెడ్ కార్పెట్ ఈవెంట్ లో చిత్ర యూనిట్ పాల్గొననున్నట్లు తెలిపాయి. హాలీవుడ్ సెలబ్రిటీలు "దేవర"మూవీ చూడనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: