తెలుగు బిగ్‌బాస్ 8 సీజన్ స్టార్ట్ అయ్యి విజయ వంతంగా 2 వారాలు పూర్తి కాబోతోంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ లో విజయవాడ బేబక్క తొందరగానే బయటకు వెళ్లిపోయారు. అదేవిధంగా ఆదివారం (సెప్టెంబర్ 15) మరొకరు హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నారని ఊహాగానాలు ఉన్నాయి. ఇక ఈ వారం ఎలిమినేషన్ కు సంబంధించి నామినేషన్స్ లో ఆదిత్య ఓం, విష్ణుప్రియ, నాగమణికంఠ, పృథ్వీరాజ్‌, శేఖర్‌ భాషా, నిఖిల్‌, సీతా, నైనికా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్యంగా వీరిలో పృథ్వీ రాజ్, కిర్రాక్ సీత డేంజర్ జోన్ లో ఉన్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. వీరిలో ఒకరు అయితే ఈ వారం సూట్ కేసు సర్దుకోనున్నారని చాలా గట్టిగా వినబడుతోంది.

ఇక ఈ వారం ఎలిమినేషన్ పూర్తయితే దాంతో హౌస్లో 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగులుతారు. మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై ఉన్న ఊహాగానాలు గురించైతే అందరికీ తెలిసిందే. ఇందులో ప్రముఖ బుల్లితెర నటి జ్యోతి రాయ్ అలియాస్ జగతి మేడం పేరు బాగా వినబడుతోంది. తెలుగు, కన్నడ ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న జ్యోతి రాయ్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే షో మరింత కలర్ ఫుల్ గా కనబడుతుందని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ విషయంపై జగతి మేడమ్ క్లారిటీ ఇస్తూ... బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం లేదని చెప్పుకొచ్చారు. కాగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి ముందు జ్యోతిరాయ్‌ని సంప్రదించారట నిర్వాహకులు.

కాగా అప్పటికే ఆమె తన షూటింగుల్లో బిజీగా ఉండడంతో రెగ్యులర్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి రాలేనని ఖచ్చితంగా చెప్పేశారట. అదేవిధంగా ఒకవేళ వీలైతే తన పెండింగ్ షూటింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత బాస్ హౌస్ లోకి రావచ్చనే హింట్ ఇచ్చారట. అయితే ఇప్పుడు షూటింగ్స్ పూర్తి కాకపోవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో కూడా హౌస్ లోకి రాలేనంటున్నారట జగతి మేడమ్. మరోవైపు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ముక్కు అవినాశ్, శోభా శెట్టి, రోహిణీ, నయని పావని, హరితేజ వైల్డ్ కార్డ్ తో హౌస్ లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది. మరి వీరిలో ఎవరు వస్తారో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: