ఇదెక్కడి చోద్యం అని అనుకుంటున్నారా? 350 కోట్ల రూపాయిలు బడ్జెట్ పెట్టడం ఏమిటి? దర్శకుడికి రెమ్యునరేషన్ లేకపోవడం ఏమిటి? అని ఆశ్చర్యం వేస్తోంది కదూ! అవును, సినిమా అంటేనే ఒక మేజిక్. విజయం సాధిస్తే ఇక్కడ చాలా మంది జీవితాలు ఒక్క రాత్రిలో మారిపోతాయి. అదే సినిమా పరాజయం పాలైతే అదే ఒక్క రాత్రిలో చాలా మంది జీవితాలు తలకిందులు అవుతాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ మూవీ ‘బడే మియా చోటే మియా’ని చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు చేయలేక పోయింది. దీంతో నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ కారణంగానే దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ కు రెమ్యునరేషన్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బాలీవుడ్లో టాక్ నడుస్తోంది.

దాంతో ఇప్పుడు సదరు దర్శకుడు తనకు న్యాయం జరగాలని ధర్నా చేస్తున్నట్టు వినికిడి. నివేదికల ప్రకారం, బడే మియా చోటే మియా దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ తన బాధను వ్యక్తం చేస్తూ డైరెక్టర్ల యూనియన్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారట! ఒప్పందం ప్రకారం ఈ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు అలీ అబ్బాస్ జాఫర్‌కు రూ.7.3 కోట్లు చెల్లించాల్సి ఉండగా సదరు నిర్మాతలు తనకు ఆ డబ్బు ఇవ్వలేదని అలీ అబ్బాస్ జాఫర్ తన ఆవేదనని వ్యక్తం చేసారు. కాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, మానుషి చిల్లార్, పృథ్వీరాజ్ సుకుమారన్, సోనాక్షి సిన్హా నటించారు. ఈ సినిమాకు దాదాపు 350 కోట్లు ఖర్చుపెట్టినట్లు అంచనా. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కేవలం 102 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది.

దాంతో నిర్మాతలు, దర్శకుడి కోటాలో క్రెడిట్ వేసి డబ్బులు ఎగ్గొట్టినట్టు సమాచారం. కాగా ‘పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌’ పతాకంపై జాకీ భగ్నానీ, వాషు భగ్నానీ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాతో నిర్మాతలకు భారీ నష్టమే వాటిల్లిందని వినికిడి. ఈ కారణంగానే తమ సంస్థలో పనిచేసిన చాలా మందికి జీతాలు కూడా చెల్లించలేదని కూడా టాక్ నడుస్తోంది. అంతే కాకుండా ముంబైలోని తమ ఆస్తులను కూడా సదరు నిర్మాతలు అమ్ముకున్నారట! ఇప్పుడు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌కి పారితోషికం ఇవ్వ లేదని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: