మన తెలుగు హీరోలు ఓ వైపు సినిమాలు చేస్తూనే ఇంకో వైపు సేవా కార్యక్రమాలు కూడా చేస్తారు. హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వివాహ భోజనంబు పేరుతో రెస్టారెంట్స్ నిర్వహిస్తోన్న ఈ యంగ్ హీరో ప్రతి బ్రాంచ్ నుంచి ప్రతి రోజూ ఉచితంగా 50 మందికి ఫుడ్ ను పంపిస్తున్నాడు. పేద వారికి, అనాథశ్రమాలకు తన ఏడు రెస్టారెంట్స్ నుంచి రోజూ 350 మందికి రోజూ ఫ్రీగా ఫుడ్ ను అందజేస్తున్నాడు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలు సంభవించినప్పుడు కూడా తన టీమ్ ను విజయవాడకు పంపించారు. అక్కడ వరద ముంపునకు గురయిన ప్రాంతాల్లోని ప్రజలకు ఫుడ్, వాటర్ అందించి తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. తాజాగా మరోసారి సందీప్ కిషన్ తన వివాహా భోజనంబు టీం చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఒక ఆసక్తికర పోస్ట్ చేశాడు. ఫుడ్ వ్యాన్ ద్వారా నగరంలో పలు చోట్ల ఉచితంగా ఫుడ్ ప్యాకెట్‌లను పంచుతున్నారట. ఇదే విషయాన్ని సందీప్ కిషన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. 'వివాహా భోజనంబు టీం చేస్తున్న నిర్విరామ కృషికి థాంక్స్ మీకు తెలిసిన వాళ్లు ఆకలితో బాధపడుతుంటే మాకు చెప్పండి. దగ్గరలో ఉన్న వివాహా భోజనంబుకివెళ్లండి.. ఫుడ్ ప్యాకెట్లు తీసుకోండి.. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి' అని పోస్ట్ చేశాడు సందీప్ కిషన్.ప్రస్తుతం సందీప్ కిషన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు హీరో పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సందీప్ కిషన్ వేసిన పోస్ట్ కు ప్రముఖ దర్శకుడు, రచయిత బీవీఎస్ రవి స్పందించాడు. వివాహా భోజనంబులో మీ హాస్పిటాలిటీ, ఫుడ్ క్వాలిటీ అన్నీ బాగున్నాయి.. నువ్వు చేసే సర్వీసెస్ ఇంకా బాగున్నాయి.త్వరలోనే తిరుపతి బ్రాంచ్‌కి వెళ్లాలని అనుకుంటున్నా' అని పోస్ట్ చేశాడు బీవీఎస్ రవి. దీనికి స్పందించిన సందీప్ కిషన్ ' థాంక్యూ సో మచ్ అన్నా' అంటూ రిప్లై ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: