ఇది ఆ చిత్ర యూనిట్ కి నిజంగా షాకిచ్చింది. ఒక్క క్షణం తేరుకొనే లోపే అంతా జరిగిపోయింది. అవును, తాజాగా విడుదలైన "లవ్ రెడ్డి" చిత్ర బృందానికి అనుకోని సంఘటన ఎదురైంది. తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న రియాక్షన్ కళ్లారా చూడడానికి తాజాగా హైదరాబాద్ నిజాంపేట్లోని ఓ మల్టీప్లెక్స్కు చిత్రబృందం వెళ్లడం జరిగింది. చిత్రం అనంతరం మూవీ టీమ్ ప్రేక్షకులతో ముచ్చటిస్తున్నారు. సినిమాని చూసి ఎంజాయ్ చేసిన జనాలకు వారు అభివాదాలు తెలుపుతున్నారు. సినిమావాళ్లు కాబట్టి వారిని చూసిన జనాలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఓ మహిళ చిత్రంలో నటించిన నటుడు ఎన్టీ రామస్వామిపై దాడి చేయగా అంతా అవాక్కయ్యారు.

అవును, లవ్ రెడ్డి చిత్ర పతాక సన్నివేశాలు చూసి భావోద్వేగానికి గురైన ఆ మహిళ, అందమైన ప్రేమ జంటను విడదీస్తావా? నీకు మనసులేదా? అంటూ కోపంతో ఊగిపోతూ, ప్రతినాయకుడి పాత్రని పోషించిన రామస్వామి కాలర్ పట్టుకొని దుర్భాషలాడింది. అనూహ్యంగా జరిగిన ఈ దాడితో చిత్ర బృందం అంతా అవాక్కయ్యారు. అంతా అలా ఆశ్చర్యపోతుండగానే ఆమె అతనిపైన చేయి చేసుకుంది. ఆ వెంటనే హీరో అంజన్, హీరోయిన్ శ్రావణి, దర్శకుడు స్మరణ్ రెడ్డి ఆ మహిళను అడ్డుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

అయినా సరే, ఆ మహిళ రామస్వామిపై మరలా దాడికి దిగే ప్రయత్నం చేసింది. ఆ మహిళ వెంట వచ్చిన వారు, ఇతర ప్రేక్షకులు ఆమెకు సర్దిచెప్పడంతో శాంతించింది. దాంతో చిత్ర బృందం ఊపిరి పీల్చుకుంది. ఈనెల 18న విడుదలైన లవ్ రెడ్డి చిత్రంలో అంజన్ రామచంద్ర, శ్రావణి జంటగా నటించిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఆ ఘటనపై మొదట చిత్ర యూనిట్ బాధపడినప్పటికీ ఆ తరువాత సినిమా ఎమోషన్ బాగా పండబట్టే ఆమెలా రియాక్ట్ అయ్యిందని, నటుడు రామస్వామి బాగా నటించాడు అని ఆనందపడింది. అయితే సదరు దృశ్యాలను చూసిన సోషల్ మీడియా జనాలు మాత్రం అదంతా బూటకం అని, సినిమా ప్రమోషన్ కోసమే అలా చేసారని కామెంట్స్ చేస్తున్నారు!

మరింత సమాచారం తెలుసుకోండి: