ఇక ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం పద్మ భూషణ్ అవార్డును 2025 జనవరి 25న ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆనందం వ్యక్తం చేస్తూ, పరుచూరి పలుకుల్లో భాగంగా ఓ ప్రత్యేక వీడియోని తాజాగా విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. "పద్మ పురస్కారాలు దేశంలోనే ఉన్నతమైన పురస్కారాలు. బాలకృష్ణ కేవలం ఒక నటుడిగానే ఇది సాధించాడు అనుకుంటే పొరపాటే. ఆయన చేసిన సమాజసేవ, ప్రజా సేవలకుగాను ఈ అవార్డు వరించిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 50 ఏళ్ల కిత్రం తొలిసారి మేకప్ వేసుకున్న బాలయ్య ఇప్పటివరకు నటుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నారు. 2014 నుంచి రాజకీయ సేవలో నిమగ్నమౌతూనే నాయకుడిగా ప్రజలకు సేవలు చేస్తున్నారు. హిందూపురంలో ఆయన ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారో తెలియంది కాదు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతోమందికి ఆయన ప్రాణదానం చేస్తున్నారు. ఈ 3 సేవల కారణంగానే ఆయనకు ఈ అవార్డు వరించిందని నా అభిప్రాయం." అని ఆయన చెప్పుకొచ్చారు.
దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా నందమూరి అభిమానులు ఆ వీడియోని పదే పదే షేర్ చేస్తున్నారు. ఇంకా పరుచూరి మాట్లాడుతూ బాలయ్య బాబు పోషించిన అనేక రకాల పాత్రల గురించి చెప్పుకొచ్చారు. ఈ మధ్య కాలంలో అన్ని రకాల జానర్లలో నటించేవారు చాలా తక్కువ మంది అయిపోయారు. అలాంటివారు బాలయ్యలాంటివాళ్లను చూసి నేర్చుకోవాలి. ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో గొప్ప విజయాలు చూశారు. మరీ ముఖ్యంగా ఆదిత్య 369, భైరవద్వీపం సినిమాల గురించి మాట్లాడుకోవాలి. అలాంటి సినిమాలు చేయాలంటే గట్స్ కావాలి. భైరవద్వీపంలో ఆయన చేసి కురూపి పాత్ర న భూతొ న భవిష్యతి... అలాంటివి చేయడం ఆయనకే చెల్లింది! అది చాలా చిత్రమైన పాత్ర. కానీ దానిని బాలయ్య అవలీలగా చేసి నిరూపించారు అని చెప్పుకొచ్చారు.