
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వరుస పెట్టి సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసుకుంటూ వెళ్లి పోతున్నారు. అఖండ సినిమా తో మొదలు పెడితే బాలయ్య కు వరుసగా అన్నీ సూపర్ డూపర్ హిట్లే. అఖండ - వీర సింహా రెడ్డి - భగవంత్ కేసరి ఇక తాజాగా సంక్రాంతికి డాకూ మహారాజ్ ఇలా అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్లే కొట్టాయి. ఇటు బుల్లి తెరపై అన్ స్టాపబుల్ టాక్ షోతో బాలయ్య చేస్తోన్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇక అఖండ సినిమా కు సీక్వెల్ గా వస్తోన్న అఖండ 2 - తాండవం సినిమా లోనూ బాలయ్య నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమా ల ట్రెండ్ బాగా నడుస్తోన్న సంగతి తెలిసిందే.
గతంలో బాలయ్య నటించిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ ఆదిత్య 369 ’ మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. 1991 లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాను 4 K డిజిటలైజేషన్, 5.1 సౌండ్తో మరింత అధునాతనంగా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహిచారు.
శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమా రీ రిలీజ్ పై మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ గారు శ్రీకృష్ణదేవరాయలుగా , కృష్ణ కుమార్గా రెండు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించారని .. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు ఈ సినిమాను తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఇప్పటి టెక్నికల్ హంగులతో మరింత గొప్ప అనుభూతిని అందించేలా రీ రిలీజ్కి సిద్ధమైందని .. తాము ముందుగా అనుకున్నట్టుగా ఈ సినిమాను ఏప్రిల్ 11న కాకుండా ఏప్రిల్ 4వ తేదీనే రీ రిలీజ్ చేయాలని నిర్ణయించామని తెలిపారు.