వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు యంగ్ హీరో రాజ్ తరుణ్. నా సామి రంగ, పురుషోత్తముడు, తిరుగబడరా సామి అంటూ ఇటీవల వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన రాజ్ తరుణ్.. తాజాగా భలే ఉన్నాడే సినిమాతో మరోసారి మన ముందుకు వచ్చాడు.


ఈ చిత్రాన్ని మారుతి సమర్పణలో తెరకెక్కించారు. ఆయనే ఈ చిత్రానికి స్టోరీ లైన్ అందించారు. దాన్ని దర్శకుడు డెవలప్ చేశారు. కొత్త నిర్మాత కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. యువ దర్శకుడు శివసాయి వర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఎలా అలరించిందో చూద్దాం పదండి..


కథ: రాధా(రాజ్ తరుణ్‌) శారీ ర్యాపర్ గా పనిచేస్తుంటారు. అమ్మాయిల చీరలోనే అందంగా ఉంటారని.. చూడగానే కుర్రాళ్లంతా పడిపోయేంత అందం శారీ లో ఉంటుందని వారికి చెబుతూ ఉంటారు. పెళ్లిళ్లకు, ఎంగేజ్ మెంట్ ఫంక్షన్లకు అమ్మాయిలకు చీరలు కడుతూ సరదాగా గడిపేస్తుంటారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రాధా.. తల్లి (అభిరామి) పెంపకంలో చాలా సౌమ్యుడిగా పెరిగి పెద్దవాడు అవుతాడు. తల్లి ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అదే బ్యాంకులో కృష్ణ(మనీషా కందుకూర్‌) కూడా చేరి గౌరికి దగ్గర అవుతుంది.


గౌరీ తెచ్చే లంచ్ బాక్స్ కి బాగా కనెక్ట్ అయిన కృష్ణ ఆ భోజనం చేస్తుంది తాను కాదని.. తన కుమారుడని గౌరీ చెబుతుంది. దీంతో రాధాని ఎలాగైనా చూడాలని కృష్ణ అనుకుంటుంది. అలా రాధాని చూడకుండానే ప్రేమిస్తుంది. అది పెళ్లి దాకా దారి తీస్తోంది. అయితే తన మిత్రురాలు వెలిబుచ్చిన సందేహం కారణంగా పెళ్లికి ముందే రాధాను సంసారానికి పనికి వస్తాడో లేదో తెలుసుకోవాలనుకుంటుంది. మరి దాంపత్య జీవితానికి రాధా పనికి వస్తాడా అని ఎలా పరీక్షించింది? అందుకు ఏం చేసింది? అది ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? ఈ రాధా కృష్ణల వివాహం జరిగిందా లేదా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


కథ.. కథనం.. విశ్లేషణ: గతంలో దర్శకుడు మారుతి సమర్పణలో వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద సాధించిన విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ భలే ఉన్నాడే చిత్రాన్ని ఆయన సమర్పణలో తెరకెక్కించారు. ప్రి రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు మారుతి చెప్పినట్లు ఈ సినిమా స్టోరీ లైన్ నిజంగానే ఇంట్రస్టింగ్ గా ఉంది. ఈ రోజుల్లో అబ్బాయిలు మంచిగా ఉంటే వీడు తేడా అని అనుమానిస్తారు. అలాంటి పాయింట్ ని బేస్ చేసుకొని దాని చుట్టూ రాసుకున్న ఎంటర్టైన్ స్క్రీన్ ప్లే దాన్ని ఎమోషనల్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తీయడంలో దర్శకుడు విజయం సాధించారని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా రాధా, కృష్ణ క్యారెక్టర్స్ గురించి చెప్తూ వారిద్దరి మధ్య లవ్ స్టోరీ తో ఫుల్ కామెడీ చూపించారు.


సెకెండ్ హాఫ్ లో రాధా కృష్ణ మధ్య ప్రేమ సన్నివేశాలు, రాధ తల్లి కథతో మంచి ఎమోషన్ కథని చాలా ఎమోషనల్ గా చూపించారు. అయితే సెకెండ్ హాఫ్ లో వచ్చే సింగీతం శ్రీనివాసరావు ఎపిసోడ్, హైపర్ ఆది తో తెరకెక్కిన సూఫీ సాంగ్ కొంత కథకు అడ్డుపడినా.. ఓవరాల్ గా భలే ఉన్నాడే అనేలా రాజ్ తరుణ్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో హీరో-హీరోయిన్ లవ్ స్టోరీ కూడా కొత్తగా రాసుకొన్నారు. ముఖ్యంగా ఈ జనరేషన్ లో కొంత మంది అబ్బాయిలు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ.. అమ్మాయిలకు దూరంగా ఉంటూ ఇంట్లో వాళ్లకు హెల్ప్ చేస్తుంటే ఎందుకు చేతకానివాడిలా చూస్తున్నారు. వాడు అబ్బాయే కాదు అనేలా చూస్తున్నారు అనే పాయింట్ ని బాగా చూపించారు.


అలాగే పెళ్లికి ముందు తప్పు చేసి కష్టాలు పడుతున్నారు అనే అంశాన్ని ఎమోషనల్ గా ఆలోచించే విధంగా చూపించారు. రాజ్ తరుణ్ అద్భుతంగా నటించారు. శారీ ర్యాపర్ గా ఆ పాత్రలో ఒదిగిపోయారు. చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ మంచి ఫెర్పార్మెన్స్ ఇచ్చారు. మనీషా కందుకూర్ కూడా తన పాత్రలో నటనతో, అందంతో కూడా మెప్పించింది. అమ్మ పాత్రలో ఒకప్పటి హీరోయిన్ అభిరామి అదరగొట్టింది. గెస్ట్ పాత్రంలో లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, లీలా శ్యాంసన్, పాత్ర ఒకే. మైపర్ ఆది, సుదర్శన్, తమిళ్ స్టార్ కమెడియన్ వీటీవీ గణేశ్ నవ్వించడంతో సక్సెస్ అయ్యారు. గోపరాజు రమణ, అమ్మ అభిరామి, ఇందు ప్రీతి.. మిగిలిన నటీనటులు వవారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.


షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో మెప్పించిన శివసాయి దర్శకుడిగా మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడు. ఈ జనరేషన్ యూత్ ఆలోచనలు ఎలా ఉంటాయనేదాన్ని పాయింట్ గా తీసుకొని ఓ కొత్త కథని సింపుల్ స్క్రీన్ ప్లే తో ఫ్రెష్ గా చూపించాడు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. అన్ని పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాత కిరణ్ కుమార్.. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని చాలా రిచ్ గా తెరకెక్కించారు. సినిమాకి ఖర్చు పెట్టి మంచి అవుట్ పుట్ ఇచ్చారు. కొత్త నిర్మాతే అయినా ఎక్కడా రాజీ పడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: