
బ్రిటన్ పార్లమెంటు లో భగవద్గీత మారుమోగింది. భారతీయులు ముఖ్యంగా హిందువులు గర్వపడే సంఘటన జరిగింది. మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు మంగళవారం దిగువ సభ హౌజ్ ఆఫ్ కామన్స్లో ప్రమాణస్వీకారం చేశారు.
ఎన్నికల్లో గెలిచిన భారత సంతతికి చెందిన సభ్యులు హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేశారు. తద్వారా బ్రిటన్ పార్లమెంటులో మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను చెప్పకనే చెప్పారు. ఈ అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.
భారత్లోని ఆగ్రాలో జన్మించిన ఆలోక్ శర్మ, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్ ప్రమాణం చేసే సమయంలో చేతిలో భగవద్గీతను పట్టుకున్నారు. ఈసారి ఎన్నికల్లో బ్రిటన్ చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో 65 మంది శ్వేతజాతీయేతరులు విజయం సాధించారు. వీరిలో 15 మంది భారత సంతతికి చెందిన వారు ఉన్నారు.
గత ప్రభుత్వంలో రిషి సునక్ ట్రెజరీ విభాగ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. 39 ఏళ్ల రిషి.. ఇంగ్లాండ్లో హాంప్షైర్ కౌంటీలో జన్మించారు. తాజా ఎన్నికల్లో యార్క్షైర్లోని రిచ్మాండ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి ఆయన ఎన్నిక కావడం ఇది మూడోసారి. భారత సంతతికి చెందిన అలోక్ శర్మ ఆగ్రాలో పుట్టి.. బ్రిటన్లో స్థిరపడ్డారు. 2010 నుంచి రీడింగ్ వెస్ట్ నియోజకవర్గానికి ఎంపీగా కొనసాగుతున్నారు. థెరిసా మే ప్రభుత్వంలో పర్యావరణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.