మనం వెళ్లాల్సిన ట్రయిన్ మిస్సయినా ఇప్పుడు దిగుల్లేదు.. ఒక వేళ మనం వెళ్లే ట్రయిన్ లో ఖాళీ లేకపోయినా బాధపడాల్సిన పని లేదు. అటుగా వెళ్లే ఏ ట్రయిన్ లోనైనా అదే టిక్కెట్ చూపించి ఎంచక్కా ఎక్కేయొచ్చు. ఒకే గమ్యానికి వెళ్లే ఏ రైలులోనైనా సాధారణ టికెట్తో కూడా ప్రయాణించొచ్చని భారతీయ రైల్వే పేర్కొంది. 'వికల్ప్' పథకం ద్వారా పాసింజర్ లేదా ఎక్స్ప్రెస్ టికెట్లు రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణీకులు రైలు మిస్ అయితే తర్వాత అదే మార్గంలో అందుబాటులో ఉన్న ఏ రైలులోనైనా ప్రయాణించొచ్చని వెల్లడించింది.
ఈ మేరకు రైల్వే శాఖ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాజధాని, శతాబ్ది, దురంతో, సువిధ, స్పెషల్ రైళ్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులో ఉండనుంది. ఇలా సూపర్ఫాస్ట్ రైళ్లను వినియోగించుకున్నందుకు పాసింజర్ల నుంచి ఎలాంటి ఎక్స్ట్రా చార్జీలు వసూలు చేయబోమని చెప్పింది. ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి ప్రయాణీకులు ఆయా రైళ్లలో ఖాళీగా ఉన్న బెర్తులను వినియోగించుకోవచ్చని తెలిపింది.
రిజర్వేషన్ వెయిటింగ్ లిస్టులో ఉన్న పాసింజర్లు కూడా ఆ టికెట్లతో ఖాళీగా ఉన్న రైళ్లలో ప్రయాణించొచ్చని వివరించింది. ఈ సదుపాయాన్ని వినియోగించుకునేందుకు టికెట్లు బుక్ చేసుకునే సమయంలో 'వికల్ప్' స్కీంను ఎంచుకోవాలని చెప్పింది. దీంతో టికెట్లు వెయిటింగ్ లిస్టులో ఉంటే అదే సమయానికి ఖాళీగా ఉండే రైలు వివరాలు సదరు వ్యక్తి మొబైల్కు ముందుగానే వస్తాయని తెలిపింది.
ఫ్లెక్సీ ఫేర్ సిస్టంను ప్రారంభించిన తర్వాత ప్రీమియర్ రైళ్లలో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. రైల్వే తాజా నిర్ణయంతో లక్షలాది ప్రయాణీకులు సౌకర్యంగా ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. మరింత సమాచారం కోసం ఈ నంబర్ కు కాల్ చేయవచ్చుToll free : 1800-2661-332, Enquiry : 09920142151