చంద్ర బాబు అసెంబ్లీ లో మొదట ప్రత్యేక ప్యాకేజీని తీర్మానం చేశాడు. ఇప్పుడేమో రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ ఏపి శాసనసభ ప్రత్యేకంగా బుధవారం తీర్మానం చేసింది. తీర్మానంలో కేంద్రప్రభుత్వం వివక్షను స్పష్టంగా ఎత్తి చూపటం గమనార్హం. వర్షాకాల చివరి రోజున సభలో విభజన హామీలేంటి ? వాటి అమలు ఎంత వరకు వచ్చింది ? అనే అంశాలపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఆ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. విభజన హామీలను, ప్రధానంగా ప్రత్యేకహోదాను ఇవ్వకుండా ఏపికి తీరని అన్యాయం చేసిందంటూ ధ్వజమెత్తారు.
తాను ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కలిసి ప్రత్యేకహోదా డిమాండ్ పై ప్రస్తావించిన ఏనాడు సానుకూలంగా స్పందించలేదని చెప్పటం గమనార్హం. హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని కేంద్రం ప్రతిపాదించిన తర్వాతే తాను ప్యాకేజికి సమ్మతించినట్లు చంద్రబాబు తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు. చివరకు ఇవ్వాల్సిన హోదా ఇవ్వకపోగా ఇస్తానని చెప్పిన ప్యాకేజి కూడా ఇవ్వకుండా కేంద్రం ఏపిని మోసం చేసిందంటూ మండిపడ్డారు.
బిజెపి మోసకారితనం వల్ల రాష్ట్రంలోని భవిష్యత్ తరాలు కూడా దెబ్బతినే పరిస్దితి వచ్చిందని చంద్రబాబు చెప్పటంలో తప్పేమీ లేదు. హోదా ఇచ్చిఉంటే ఈపాటికే రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు వచ్చి ఉండేవంటూ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో సభలోనే ఉన్న బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా చంద్రబాబు సీరియస్ అయ్యారు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, స్పీకర్ కోడెల శివప్రసాద్ జోక్యం చేసుకుని ప్రత్యేకహోదాను సమర్దిస్తున్నారా ? లేక వ్యతిరేకిస్తున్నారా ? చెప్పాలంటూ విష్ణుకుమార్ రాజును ఆదేశించారు. దాంతో రాజు కూడా తాము హోదాకు వ్యతిరేకం కాదన్నారు. కాకపోతే చంద్రబాబు ప్రస్తావిస్తున్న భిన్నమైన అంశాలపైనే తాను మాట్లాడదలచినట్లు చెప్పినా స్పీకర్ అనుమతించలేదు.