ఏపీలో వైసీపీ దెబ్బకు టీడీపీ తునాతునకలు అయిపోతోంది. ఆ పార్టీకి మిగిలిన 23 మంది ఎమ్మెల్యేలే కాకుండా మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇలా ఎవరికి వారు ఇతర పార్టీల్లోకి జంప్ చేసేసేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. నలుగురు ఎంపీలు బీజేపీలోకి వెళ్లారో లేదో ఆ వెంటనే అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి కూడా కాషాయ కండువా కప్పేసుకున్నారు.
ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే వంతు వచ్చింది. ఈ సారి మహిళా మాజీ ఎమ్మెల్యే టీడీపీకి షాక్ ఇచ్చి బీజేపీలో చేరిపోయారు. ఆ మహిళా ఎమ్మెల్యే చంద్రబాబు సొంత జిల్లాకు చెందిన వారు కావడం మరో విశేషం. సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత, నాగలాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామూర్తిరెడ్డిలు సోమవారం గుంటూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరారు.
హేమలతో 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014తో పాటు గత ఎన్నికల్లో సీటు ఆశించినా చంద్రబాబు మాత్రం ఆమెకు సీటు ఇవ్వలేదు. తాజా ఎన్నికల్లో ఆమె సత్యవేడు సీటు కోసం విశ్వప్రయత్నాలు చేశారు. చంద్రబాబు ఒకానొక దశలో సీటు ఇచ్చినట్టే ఇచ్చి మరీ ఆమెకు షాక్ ఇచ్చారు. సీటు రాకపోయినా ఆమె మాత్రం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేడీ రాజశేఖర్ గెలుపు కోసం ఆమె కృషి చేశారు. ఇక తాజాగా ఏపీలో టీడీపీకి సీన్ లేదని డిసైడ్ అయిన బీజేపీ రాష్ట్ర నాయకులతో టచ్లోకి వెళ్లి ఆ పార్టీలో చేరిపోయారు.