అమరావతి నిర్మాణం కోసం రైతులు 30వేలకు పైగా ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇచ్చారు. అయితే అప్పడు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు తమ బినామీల పేరుతో ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొన్నారన్నది వైసీపీ నేతల ఆరోపణ. దీన్ని ఎన్నోసార్లు ప్రస్తావించారు కూడా. అయితే ఇటీవల అమరావతి భూ అక్రమాలపై సీఎం నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.
ఇప్పుడు ఆ వివరాలు కలకలం సృష్టిస్తున్నాయి. అధికారిక రహస్యాలు వెల్లడించనని చేసిన ప్రమాణాన్ని తుంగలోకి తొక్కి.. అప్పట్లో చంద్రబాబు రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే అంశంపై తన వందిమాగధులకు లీకులిచ్చి ఈ ఇన్సైడర్ ట్రేడింగ్కు తెరదీశారు. ముందుగా ఆ ప్రాంతంలలో న కోటరీ నేతలు, బినామీలు తక్కువ ధరకు భూములు దోచేశాక, రాజధానిపై అధికారిక ప్రకటన చేశారు. ఇదో అంతర్జాతీయ కుంభకోణమని అప్పట్లో ప్రసార మాధ్యమాలు, రాజకీయ పక్షాలు, మేధావులు ఆరోపించారు.
ఇప్పుడు రాజధాని భూములను దక్కించుకున్న వారి జాబితా సిద్ధంగా ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. వీరంతా రాజధాని ప్రాంతంలో భారీ ఎత్తున భూముల్ని తక్కువ ధరకు కాజేశారు. జూన్ 1, 2014 నుంచి డిసెంబర్ 31, 2014 మధ్య జరిగిన రిజిస్ట్రేషన్లు పరిశీలించాక.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా 4,069.94 ఎకరాలను కొల్లగొట్టినట్టు వెల్లడైంది.
ఇక ఆ భూములు దక్కించుకున్న వారెవరంటే.. చంద్రబాబుకు సన్నిహితుడైన లింగమనేని రమేష్.. తన పేరిట, భార్య ఎల్.సుమన, బంధువులు ఎల్.ప్రశాంతి, ఎల్.స్వర్ణకుమారి, ఎల్వీ రమేష్, ఎల్వీఎస్ రాజశేఖర్ల పేరిట భారీగా భూములు కొనుగోలు చేశారట. మాజీ మంత్రి నారాయణ.. తన వద్ద పనిచేసే అవుల మునిశంకర్, రాపూరు సాంబశివరావు, పొత్తూరి ప్రమీల, కోతపు వరుణ్కుమార్ల పేర్లతో 55.27 ఎకరాల భూమిని కొన్నారట.
అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన బినామీ గుమ్మడి సురేష్ పేరిట 38.84 ఎకరాల భూమి.., అప్పటి టీడీపీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ తన బినామీ సంస్థ అభినందన హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 68.6 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు సన్నిహితుడైన వేమూరు రవికుమార్ ప్రసాద్ ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గోష్పాద గ్రీన్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ ట్రెండ్స్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ పేరిట 62.77 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది.