
అసెంబ్లీలో ఇంగ్లీషు మీడియం చదువులపై జరిగిన చర్చలో వైసీపీ ఎమ్మెల్యేలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబును, ఇటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ నూ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడినీ కలిపి విమర్శిస్తున్నారు. పేదలు చదువుకుంటామంటే ఈ ముగ్గురికీ ఇష్టం లేదని విమర్శిస్తున్నారు. మురికివాడల్లో ఉంటున్న దళిత బిడ్డలు ఏబీసీడీలు నేర్చుకుంటామంటే చంద్రబాబు, పవన్, వెంకయ్యనాయుడుకు ఎందుకు ఇబ్బంది కలుగుతుందని ప్రశ్నిస్తున్నారు.
సీఎం వైయస్ జగన్ తీసుకువచ్చిన ఇంగ్లిష్ మీడియం బోధనను వీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు వంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రశ్నించారు. ఇంగ్లిష్ మీడియం పేదలకు దక్కకుండా చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ బిల్లును కౌన్సిల్లో ఎందుకు తిరస్కరించారని నిలదీస్తున్నారు.
ఈ అంశంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే సుధాకర్బాబు మాట్లాడుతూ.. ‘చరిత్రాత్మకమైన బిల్లును సమర్థించలేక మండలిలో తిరస్కరించి సవరణలు కోరడంపై దళితులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన సమస్యలపై చర్చించేటప్పుడు సభలో ప్రతిపక్షం ఉండడం లేదు. అమ్మఒడి పథకం ద్వారా రూ.6456 కోట్లతో 43 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరిందన్నారు. పేద తల్లుల మనస్సు తెలుసుకున్న నాయకుడు సీఎం వైయస్ జగన్. ఇంగ్లిష్ మీడియం, అమ్మఒడి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరుగుతుందన్నారు సుధాకర్ బాబు.
వైసీపీ ఎమ్మెల్యేలు ఇంకా ఏమంటున్నారంటే.. " రాజధానుల గురించి టీడీపీ చాలా దుష్ప్రచారం చేస్తోంది. చంద్రబాబు చేసిన అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం ఉందో లేదో కానీ, మా నాయకుడు సీఎం వైయస్ జగన్ ఎక్కడ ఉంటే అక్కడే మా రాజధాని. ప్రపంచంతో పోటీ పడేలా పిల్లలకు ఏబీసీడీలు నేర్పిస్తానని సీఎం వైయస్ జగన్ అంటే.. చంద్రబాబు, పవన్, వెంకయ్యనాయుడుకు ఎందుకు కష్టం వచ్చింది. మారుమూల ప్రజలు ఇంగ్లిష్ మీడియంలో చదివితే నారాయణ, చైతన్య స్కూళ్లు మూతపడతాయని భయం పట్టుకుందని నిలదీస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు.