
సమాచార సాంకేతిక పరిజ్ఞాన మహా విప్లవ వేదికగా, విజ్ఞాన వినోద వికాసాలను ఇంటింటికీ అందించే వారధిగా నేటి ప్రపంచంలో అంతర్జాలం(ఇంటర్నెట్) అత్యవసరంగా మారిపోయింది. పౌరులందరికీ అంతర్జాల సేవలు చేరువ చేసేందుకు ఉద్దేశించిన 'డిజిటల్ ఇండియా' కొన్నాళ్లుగా నత్తనడకన సాగుతోంది. ఆ క్రతువుకు చురుకు పుట్టించి డిజిటల్ స్వప్నాన్ని సాకారం చేయగల మహదవకాశం కొత్తగా భారత్ తలుపు తట్టింది. తమ తమ మాతృభాషల్లో భారతీయుల ఇళ్లకు సమాచారం చేరవేయడానికి, దేశమంతటా డిజిటలీకరణకు ఊతమివ్వడానికి వచ్చే అయిదు నుంచి ఏడేళ్లలో రూ.75వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి గూగుల్ సారథి సుందర్ పిచాయ్ సంసిద్ధత వ్యక్తపరచడం కీలక పరిణామం. ఈ ఏడాది చివరికి 10లక్షల మంది బోధన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సీబీఎస్ఈ(కేంద్ర మాధ్యమిక విద్యా మండలి)తో గూగుల్ కుదుర్చుకున్న ఒప్పందం ఎన్నదగింది.
జియో సంస్థల్లో సుమారు రూ.42వేల కోట్ల పెట్టుబడులు గుమ్మరించిన ఫేస్బుక్ను వెన్నంటి ఇప్పుడు గూగుల్ సైతం రూ.30వేల కోట్ల మేర పెట్టుబడులకు ఆసక్తి కనబరుస్తోంది. భారత్లోని పెద్ద కంపెనీలు, అంకుర సంస్థల్లో ఈక్విటీ పెట్టుబడులు, భాగస్వామ్యాల పట్ల దిగ్గజ సంస్థల ఆసక్తి.. కరోనా మహమ్మారి ఆవరింపజేసిన నిరాశానిస్పృహల నేపథ్యంలో నవోత్తేజం కలిగించేదే. నేడు ఆన్లైన్ పాలన, బోధన, లావాదేవీలకు విశేష ప్రాముఖ్యం ఏర్పడింది. ఊరూరా ఇంటింటా అంతర్జాల సదుపాయ పరికల్పనకు ఉద్దేశించిన 'డిజిటల్ ఇండియా' తడబాటు ప్రస్థానం ఇకమీదట జవనాశ్వం వడినీ వేగాన్నీ సంతరించుకునేలా- గూగుల్ తాజా చొరవ ఎంతగా ప్రభావాన్వితమవుతుందో చూడాలి!వాషింగ్టన్, బీజింగ్ల నడుమ విభేదాలు రచ్చకెక్కిన దరిమిలా చైనాలో వాణిజ్యం నెరపే వీల్లేకుండా గూగుల్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, ట్విటర్ వంటి సంస్థలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి.
సహజంగానే వాటి దృష్టి చైనా తరవాత అత్యధికంగా 56కోట్ల మంది దాకా అంతర్జాల వినియోగదారులకు నెలవైన ఇండియాపై ప్రసరించింది. ఆ సంఖ్య భారత జనాభాలో సగానికన్నా తక్కువ కావడం మున్ముందు ఇనుమడించే వాణిజ్యావకాశాల్ని ప్రస్ఫుటీకరించేదే. గల్వాన్ లోయలో తీవ్రఘర్షణ, ఉద్రిక్తతల దృష్ట్యా టిక్ టాక్ సహా 59 చైనా యాప్లపై భారత్నిషేధాస్త్రం ప్రయోగించింది. భారత విపణిలో దాగిన అపార అవకాశాల్ని రెండు చేతులా అందిపుచ్చుకోవడం గూగుల్ ప్రభృత సంస్థలకు ఎంత లాభిస్తుందో, దేశ డిజిటల్ ప్రస్థానాన్ని శీఘ్రతరం చేసే అవకాశం ఇండియాకూ అంతే ప్రయోజనదాయకం.