ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటామని జగన్ సర్కారు మరోసారి నిరూపించుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో గ్యాంగ్ రేప్ కు గురైన బాలికకు ప్రభుత్వం 10లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం, మధురపూడి గ్రామానికి చెందిన మైనర్ బాలిక కొన్ని రోజుల క్రితం కొందరు యువకుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైంది.
ప్రస్తుతం ఆ మైనర్ బాలిక రాజమండ్రిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కామాంధుల చేతిలో లైంగికదాడికి గురై రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలికనును రాష్ట్ర మంత్రి తానేటి వనిత పరామర్శించారు. ప్రభుత్వం తరపున సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధితురాలికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం మంజూరు చేసినట్లు తెలిపారు.
ఇదే సమయంలో సీతానగరం ఘటన బాధితుడిని కూడా మంత్రి తానేటి వనిత పరామర్శించారు. సీతానగరంలో ఓ దళిత యువకుడిని ఇటీవల కొందరు శిరోముండనం చేసిన సంగతి తెలిసిందే. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని పరామర్శించిన మంత్రి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అయితే మంత్రి సందర్శన సమయంలో దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడం లేదంటూ దళిత సంఘాలు మంత్రి దృష్టికి తీసుకువచ్చాయి. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్న మంత్రి... ఘటనకు సంబంధించిన బాధ్యులైన వారందరిపై చర్యలు తప్పవని మంత్రి వనిత తెలిపారు.