ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి విందులో మాంసం సరిగా వడ్డించలేదు అన్న కారణం తో మొదలైన ఘర్షణగా ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళింది. వధువు మేనమామ ఈ ఘటనలో ప్రాణాలు వదలడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. వెలిగండ్ల మండలం గుమ్మల్ల కర్ర కు చెందిన మన్నేపల్లి సురేష్ తన మేనకోడలు కవిత వివాహానికి నరసమాంబ పురం వచ్చాడు. ఇక బంధుమిత్రులు పెద్దల మధ్య వివాహం ఘనంగా జరిగింది, పెళ్లి అనంతరం అందరూ కలిసి విందు భోజనానికి వెళ్లారు.
విందు భోజనాల దగ్గర చిన్న వివాదం మొదలైంది. వరుడు తరపు బంధువులకు మాంసం సరిగా వడ్డించలేదు అంటూ వాగ్వాదానికి దిగడంతో... చిన్న గొడవ మొదలైంది. ఆ తర్వాత వధువు వరుడు తరపు కుటుంబాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పెళ్లి లో ఉన్న పెద్దలు కల్పించుకోవడం తో చిన్న గొడవ కాస్త సద్దుమణిగింది. కానీ వధువు మేనమామ సురేష్ తమను అవమానించాడు అంటూ వరుడు తరపు బంధువులు కక్ష పెంచుకున్నారు. ఇక సాయంత్రం బడ్డీ కొట్టు దగ్గరికి సురేష్ వెళ్ళగానే వరుడు తరపు కుటుంబసభ్యులు గొడ్డలితో దారుణంగా సురేష్ పై దాడి చేసి విచక్షణారహితంగా నరికారు. అనంతరం అక్కడ నుంచి వెళ్ళిపోయారు. స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించినప్పటికి మార్గమధ్యంలోనే చనిపోయాడు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.