ఇటీవలే ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వేలో సంచలన నిజాలు బయటపడ్డాయి. ప్రస్తుతం కరోనా వైరస్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకొని ఆ తర్వాత.. కరోనా ఉందా లేదా అని నిర్ధారణ చేసుకుంటున్నారు. ఒకవేళ కరోనా వైరస్ సోకినట్లు పాజిటివ్ అని వస్తే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని కోలుకుంటున్నారు ఎంతోమంది. ఇలా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకుని కరోనా పాజిటివ్ అని తేలిన వారు దేశంలో 61 లక్షల మంది. కానీ భారత్లో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య కేవలం 61 లక్షలు మాత్రమే కాదని కోట్లల్లో ఉంది అంటూ తాజాగా ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వే వెల్లడించింది.
ఏకంగా ఇప్పటి వరకు దేశంలో 8.58 కోట్ల మంది ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు అన్న విషయం ఈ సర్వేలో వెల్లడైనట్లు ఐసీఎంఆర్ తెలిపారు. దేశంలోని డెబ్బై జిల్లాలలో నిర్వహించిన సర్వే ప్రకారం పదేళ్ల వయసు పైబడిన వారిని పరీక్షించగా.. వారిలో 6.6 శాతం మందిలో యాంటీబాడీలు కనిపించాయి అన్న విషయం సర్వేలో తేలినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 22 మధ్య ఈ సర్వే నిర్వహించగా ఈ ఆసక్తికర విషయాలు బయట పడినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.