ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా అనే ఫార్మా సంస్థ.. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను ఇండియాలోనే అభివృద్ధి చేశారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలతో కలిసి ఈ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది.
చింపాంజీలలో కనిపించే కామన్ కోల్డ్ వైరస్ బలహీనపరిచిన వెర్షన్ ను కొవిషీల్డ్ అభివృద్ధిలో ఉపయోగించారు. ఇందులో కరోనా వైరస్ స్పైక్ ప్రొటీన్ కు సంబంధించిన జన్యు పదార్థాన్ని వినియోగించారు. వ్యాక్సినేషన్ తర్వాత స్పైక్ ప్రొటీన్ ఉత్పత్తయి, వైరస్పై దాడి చేసేలా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఇక కొవాగ్జిన్ అనేది ఒక ఇన్ యాక్టివేటెడ్ వ్యాక్సిన్.
కొవిషీల్డ్ వ్యాక్సిన్ సామర్థ్యం 70.42 శాతంగా తేలింది. తొలి దశలో 23,745 మందిపై ప్రయోగాలు చేశారు. రెండు, మూడు దశల్లో వచ్చిన ఫలితాలు కూడా 70.42 శాతంగా ఉన్నట్లు తెలిపింది. భారత్ బయోటెక్ తొలి, రెండో దశల్లో 800 మందిపై ప్రయోగాలు నిర్వహించింది. వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేసినట్లు చెప్పినా ఎంత శాతం అనేది మాత్రం వెల్లడించలేదు.
ప్రస్తుతానికి వ్యాక్సిన్ అందుకోబోయే తొలి 3 కోట్ల మందికి ఫ్రీ గానే ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాతే వ్యాక్సిన్ ధరను ఈ రెండు సంస్థలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అయితే కొవిషీల్డ్ ధర రూ.400 వరకు ఉండవచ్చని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా గతంలో వెల్లడించారు. ఇక భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ధర మాత్రం రూ.100 లోపే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ వ్యాక్సిన్ ల ధరపై ఇంకా స్పష్టత రాలేదు.