దేశంలో ఇప్పటివరకూ 44 లక్షల 49 వేల 552 మందికి కరోనా వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. 19 రోజులుగా భారత్లో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో టీకా పంపిణీ వేగవంతంగా కొనసాగుతోంది. రోజు రోజుకీ వ్యాక్సిన్ తీసుకొనే వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా టీకాల విషయంలో ప్రపంచ రికార్డులు మన కు కొత్తేమీ కాదు.. గతంలో ఆరు రోజుల్లోనే ఇండియా మిలియన్ టీకాలు పూర్తి చేసింది.
గతంలో ఆరు రోజుల్లోనే ఇండియా మిలియన్ టీకాలు పూర్తి చేస్తే.. అమెరికా 10 రోజుల్లో మిలియన్ టీకాలు పూర్తి చేసింది. స్పెయిన్ 12 రోజుల్లో మిలియన్ టీకాలు పూర్తి చేసింది. ఇజ్రాయల్ 14 రోజుల్లో మిలియన్ టీకాలు పూర్తి చేసింది. యూకే 18 రోజుల్లో.. ఇటలీ 19 రోజుల్లో.. జర్మనీ 20 రోజుల్లో మిలియన్ టీకాలు పూర్తి చేశాయి. ఇక యూఏఈ అయితే 27 రోజుల్లో మిలియన్ టీకాలు పూర్తి చేశాయి.
కరోనాపై చేస్తున్న పోరాటం కారణంగా ఇప్పుడు ఇండియావైపు ప్రపంచం మొత్తం చూస్తోంది. కరోనా మహమ్మారి పీచమణిచే వ్యాక్సీన్ రూపొందించం ద్వారా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. అంతే కాదు.. తన పొరుగుదేశాలకు కూడా ఇండియా కరోనా వ్యాక్సీన్ ఉచితంగా అందిస్తూ.. మిత్ర దేశాల అభిమానం చూరగొంటోంది. మన శాస్త్రవేత్తల కృషి పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచంలో ఇండియా గర్వంగా తలెత్తుకుంటోంది. దాదాపు 150కి పైగా దేశాలు మాకూ టీకా సరఫరా చేయరా ప్లీజ్ అంటూ ఇండియాను కోరుతున్నాయి.